విజయవాడ: ఆంధ్రప్రదేశ్కు మరో ప్రాముఖ్యమైన రైల్వే సౌకర్యం సిద్ధమవుతోంది. విజయవాడలో అత్యాధునిక వందేభారత్ రైళ్ల మెయింటెనెన్స్ డిపో నిర్మాణం తుది దశకు చేరుకుంది. మిల్క్ ఫ్యాక్టరీ సమీపంలో, ఫ్లై ఓవర్ పక్కన, రైల్వే యార్డు పరిసరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ డిపో త్వరలో ప్రారంభం కానుంది.
ప్రస్తుతం విజయవాడ మీదుగా మూడు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ – విశాఖపట్నం, తిరుపతి – విజయవాడ, విజయవాడ – చెన్నై మార్గాల్లో సేవలందిస్తున్న ఈ రైళ్లకు మెరుగైన నిర్వహణ అవసరమవుతుంది. ఈ డిపో అందుబాటులోకి వచ్చిన తర్వాత, నిర్వహణ మరింత సమర్థంగా జరుగుతుందనే అభిప్రాయాన్ని రైల్వే అధికారులు వ్యక్తపరిచారు.
మెట్రో తరహాలో ట్రాక్లు, స్లాబ్లు సిద్ధం
డిపోలో రైళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మెట్రో రైల్వేల తరహాలో ట్రాక్లు నిర్మించి, మెకానిక్లు సులభంగా పనులు చేయగలిగేలా కాంక్రీట్ స్లాబ్లు వేశారు. ప్రస్తుతం విజయవాడ – చెన్నై వందేభారత్ రైలుకు కోచింగ్ డిపోలో నిర్వహణ జరుగుతోంది. ఇకపై అన్ని వందేభారత్ రైళ్లకు ఒకేచోట, ప్రత్యేక డిపోలో నిర్వహణ జరగనుంది.
పరిపాలన భవనం, నీటి సదుపాయాలు కూడా సిద్ధం
డిపోతోపాటు ఒక పరిపాలన భవనాన్ని కూడా నిర్మించారు. అధికారులు, సాంకేతిక సిబ్బంది పనితీరు కోసం అవసరమైన అన్ని వసతులు కల్పించారు. నీటి సరఫరా కోసం ఓవర్ హెడ్ ట్యాంక్ను ఏర్పాటు చేశారు.
భవిష్యత్తు అవసరాలకు ముందస్తు సన్నాహం
చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో వందేభారత్ రైళ్లు తయారవుతున్నందున, భవిష్యత్తులో మరిన్ని వందేభారత్ రైళ్లు విజయవాడ మీదుగా నడిచే అవకాశముంది. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు ఈ డిపో ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలో రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్ అయిన విజయవాడలో వందేభారత్ రైళ్ల మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక డిపో అవసరం ఉండటంతో ఇది ఏర్పాటు చేశారు.
అటు చిత్తూరు జిల్లా రేణిగుంటలో కూడా వందేభారత్ మెయింటెనెన్స్ సెంటర్ను ఇప్పటికే ప్రారంభించారు. అక్కడ కూడా వందేభారత్ రైళ్ల నిర్వహణ కొనసాగుతోంది.