తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి 12:05 గంటలకు వైకుంఠ ద్వారాలను తెరిచారు. అర్చకులు స్వామివారికి వైదిక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
మొదట వీఐపీ దర్శనాలు నిర్వహించగా, ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ ప్రారంభించింది. టోకెన్లు ఉన్న భక్తులు టోకెన్లో పేర్కొన్న సమయానికే తిరుమలకు రావాలని టీటీడీ సూచించింది.
టీటీడీ కీలక సూచనలు
- టోకెన్లు ఉన్న భక్తులకే దర్శనం
- ఆధార్ కార్డు, టోకెన్ ప్రింట్ కాపీ తప్పనిసరి
- టోకెన్లు లేని భక్తులు జనవరి 2 నుంచి నేరుగా రావాలని విజ్ఞప్తి
కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు కొనసాగుతున్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న ప్రముఖులు
వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైన వెంటనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు. అలాగే మంత్రి పయ్యావుల కేశవ్, మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు, సినీ నటుడు నారా రోహిత్, నిర్మాత డీవీవీ దానయ్య, క్రికెటర్ తిలక్ వర్మ, భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.
సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ ఏర్పాట్లు చేయడం అభినందనీయమని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.



