ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆవరణలోకి వెళ్లిన అనంతరం, ముందుగా ఆయన వెయిటింగ్ రూమ్లో విశ్రాంతి తీసుకున్నారు. విచారణ ప్రారంభమైన వెంటనే కోర్టు సిబ్బంది ‘ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి’ అని పిలవగా, జగన్ కోర్టు హాల్లోకి వెళ్లి న్యాయమూర్తికి నమస్కరించారు.
న్యాయమూర్తి సూచన మేరకు హాజరు పట్టికపై సంతకం చేసిన తర్వాత, అవసరమైన ప్రక్రియ పూర్తికాగానే జడ్జి జగన్ను వెళ్లేందుకు అనుమతించారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి జగన్ను ఎలాంటి ప్రశ్నలు అడగలేదు; కేవలం ఆయన హాజరును మాత్రమే నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లపై విచారణ రాబోయే రోజుల్లో కొనసాగనుంది.
జగన్ తదుపరి విచారణకు ఎప్పుడు హాజరు కావాలనే విషయంపై కోర్టు త్వరలో నిర్ణయం తీసుకోనుంది. కోర్టు నుంచి బయటికొచ్చిన జగన్ నేరుగా తన హైదరాబాద్ నివాసమైన లోటస్పాండ్కి చేరుకున్నారు. అక్కడికల్లా పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు ఇప్పటికే చేరుకున్నారు. లోటస్పాండ్లోకి మాత్రం కొద్దిమంది కీలక నేతలకే అనుమతి ఇచ్చారు. వీరితో జగన్ సుమారు గంటన్నర పాటు చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.
తెలంగాణ వైసీపీ కీలక నేతలూ జగన్ను కలవడానికి వచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకూ వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు, మీడియాతో జగన్ మాట్లాడుతారా లేదా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది.



