చలికాలం మొదలయ్యాక మార్కెట్లలో పండ్లు, కూరగాయలు విస్తారంగా లభిస్తాయి. ఈ సీజన్లో వచ్చే వ్యాధులను నివారించేందుకు పోషకాలు ఉన్న పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్ను ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.
ఆయుర్వేదం ప్రకారం శీతాకాలంలో జఠరాగ్ని మరింత బలపడుతుంది. అందువల్ల బరువైన ఆహారాలు కూడా సులభంగా జీర్ణమవుతాయి. ఈ సమయంలో శరీరాన్ని వెచ్చగా, శక్తివంతంగా ఉంచే డ్రైఫ్రూట్స్ను సేవించాలనే సూచన నిపుణులది. వీటిలో ఖర్జూరం (Dates) చాలా ముఖ్యమైన సూపర్ఫుడ్. ఎండు ఖర్జూరాలు పాలలో మరిగించి రాత్రి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం…
చిన్నగా కనిపించే ఖర్జూరంలో రుచికరమైన తీపి పాటు శక్తి, పోషకాలు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో ఖర్జూరాలను సహజ టానిక్గా పరిగణిస్తారు. ఇవి శరీరానికి వేడి అందిస్తూ బలహీనతను తగ్గిస్తాయి. అందుకే శీతాకాలంలో ఖర్జూరం తినడం ఎంతో ప్రయోజనకరం.
గుండె ఆరోగ్యానికి ఖర్జూరం:
ఖర్జూరాల్లో ఉండే పొటాషియం, ఇనుము రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. హిమోగ్లోబిన్ స్థాయిలను సమతుల్యం చేస్తూ గుండె పనితీరును దృఢంగా ఉంచుతాయి. దీంతో అధిక రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
మెదడు ఆరోగ్యానికి మేలు:
ఖర్జూరాల్లో ఉండే మెగ్నీషియం, ఫాస్ఫరస్ మెదడు ఒత్తిడిని తగ్గించి నరాలను బలపరుస్తాయి. చదువు లేదా ఎక్కువగా మానసిక పనులు చేసే వారికి ఇవి ఎంతో ఉపయోగకరం.
ఎముకలు మరియు దంతాలకు బలం:
ప్రతిరోజూ ఖర్జూరాలు తీసుకుంటే బలహీనత, అలసట తగ్గడంతో పాటు కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు, దంతాలు బలపడతాయి. ముఖ్యంగా వృద్ధులకు ఖర్జూరం–పాలు ఒక సహజ ఔషధంలా పనిచేస్తాయి. ఇది ఆర్థరైటిస్ నొప్పులకు ఉపశమనాన్ని ఇస్తుంది. చర్మం, జుట్టు, రక్త శుద్ధికి కూడా ఇది మేలు చేస్తుంది. పాలిచ్చే తల్లులకు ఇది ప్రయోజనకరం.
ఎలా తయారు చేసుకోవాలి?
- 2–3 ఎండు ఖర్జూరాలు
- 1 గ్లాసు పాలు
పాలను ఒక పాత్రలో మరిగించాలి. మరిగే పాలలో ఎండు ఖర్జూరాలు వేసి కొద్దిగా చిక్కబడే వరకు ఉంచాలి. ఖర్జూరాలు మెత్తబడిన తర్వాత రాత్రిపూట ఈ పాలను తాగితే శరీరానికి మంచి వేడి, శక్తి లభిస్తుంది. కావాలంటే పాలలో మఖానా కూడా కలపవచ్చు.



