ఒకప్పుడు మనుషులు ముఖాముఖిగా మాట్లాడేవారు. ఇప్పుడు అదే ఇంట్లో పక్క గదిలో ఉన్నా ఫోన్ ద్వారా మాట్లాడుకుంటున్నారు. మొబైల్ ఫోన్ల అభివృద్ధితో మనుషుల మధ్య సంబంధాలు మారాయి. మొబైల్ ఫోన్ పరిణామం అనేక దశల్లో జరుగుతూ వచ్చిందినా, మారనిది మాత్రం దాని నంబర్ పొడవు — 10 అంకెలే. మరి ఇదెందుకు?
మొబైల్ నంబర్ల పరిణామం
భారతదేశంలో మొబైల్ సేవలు 1995లో ప్రారంభమయ్యాయి. అప్పట్లో మొబైల్ నంబర్లు కేవలం 8 అంకెలు ఉండేవి. కానీ 2000 తర్వాత వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. 2003లో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI), అన్ని మొబైల్ నంబర్లను 10 అంకెలుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. అప్పటి 8 అంకెల నంబర్లకు ముందు 9 అనే అంకెను జోడించారు.
10 అంకెల ఎంపిక వెనుక కారణాలు
10 అంకెల ద్వారా మొత్తం 10 బిలియన్ (1000 కోట్లు) వేర్వేరు నంబర్లను రూపొందించవచ్చు (10¹⁰). ఇది భారీ జనాభా ఉన్న భారతదేశానికి సరిపోయేలా ఉంటుంది. 8 అంకెలతో కేవలం 10 కోట్ల నంబర్లే సాధ్యమవుతాయి, ఇది ప్రస్తుత అవసరాలకు చాలా తక్కువ.
అంతర్జాతీయ ప్రమాణం: E.164
ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) నిర్దేశించిన E.164 ప్రమాణం ప్రకారం, దేశ కోడ్ సహా ఫోన్ నంబర్ పొడవు గరిష్ఠంగా 15 అంకెల వరకు ఉండాలి. భారత్కు కంట్రీ కోడ్ +91, మొబైల్ నంబర్ 10 అంకెలు కలిపితే — మొత్తం 12 అంకెలు అవుతాయి, ఇది సరైన ఫార్మాట్.
మొబైల్ నంబర్లో అంకెల ప్రాముఖ్యత
- మొదటి అంకె (ఉదా: 9, 8, 7) → ఆపరేటర్ కోడ్
- తర్వాతి 2–3 అంకెలు → మొబైల్ సర్వీస్ కోడ్ (MSC)
- చివరి 5 అంకెలు → వినియోగదారుని ప్రత్యేక ఐడీ (UID)
ఈ నిర్మాణం వల్ల స్విచింగ్, రూటింగ్ వంటి టెలికాం నెట్వర్క్ ప్రక్రియలు సులభంగా పనిచేస్తాయి.
11 అంకెల ప్రతిపాదనపై చర్చ
2019లో 11 అంకెల మొబైల్ నంబర్ల ప్రతిపాదన వచ్చింది. దీనిపై టెలికాం ఆపరేటర్లు వ్యతిరేకత తెలియజేశారు. కానీ భవిష్యత్లో Internet of Things (IoT), 5G వృద్ధితో ప్రతీ డివైస్కి ఒక నంబర్ అవసరం కావడంతో, ట్రాయ్ మళ్లీ పరిశీలనలో పెట్టింది.
నేటి అవసరాలకు సరిపడే వ్యవస్థ
ఇప్పుడు భారత్లో మొబైల్ కనెక్షన్లు 120 కోట్లకు చేరుకున్నాయి. కానీ 10 అంకెల ఫార్మాట్తో 880 కోట్ల నంబర్లు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇది భవిష్యత్ అవసరాలను తీర్చగల సామర్థ్యం కలిగిన వ్యవస్థ అని నిపుణులు చెబుతున్నారు.



