విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎవరికీ అర్థం కాని స్థితిలో ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి విజయం సాధించారు. అయితే ఎన్నికల అనంతరం కొద్దిరోజులు నియోజకవర్గంలో చిన్నపాటి పనులు చేసిన ఆయన, యాక్సిడెంట్ తర్వాత పూర్తిగా హైదరాబాద్కే పరిమితం కావడం వల్ల, గత ఆరేడు నెలలుగా ఎమ్మెల్యే కనిపించడం లేదని ప్రజలు గట్టిగా విమర్శిస్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కాని స్థితి కొనసాగుతోందని అసంతృప్తి వ్యక్తమవుతోంది.
కూటమి ప్రభావం లేకపోవడం
ప్రస్తుత పరిస్థితుల్లో నియోజకవర్గంలో పెద్దగా రాజకీయ చైతన్యం కనిపించడం లేదు. బీజేపీకి స్థానికంగా బలమైన నాయకత్వం లేకపోవడం, ఉన్నవారిలోనూ ఎక్కువ మంది మాజీ టిడిపి నేతలే కావడం, వారిలో అంతర్గత విభేదాలు ఉండడం వల్ల ఎవరు ప్రజల్లోకి వెళ్లడం లేదు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు టిడిపి నాయకులు ఇతర నియోజకవర్గాల్లో “సుపరిపాలనలో తొలి అడుగు”, “తల్లికి వందనం” వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నా, విజయవాడ వెస్ట్లో మాత్రం ఆ చైతన్యం కనిపించడం లేదు.
బీజేపీ వైఖరిపై ప్రశ్నలు
ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం ఏమిటంటే – విజయవాడలో బలంగా ఉన్న బీజేపీ నేతలే వెస్ట్ నియోజకవర్గాన్ని పూర్తిగా పట్టించుకోకపోవడం. ఎమ్మెల్యే గైర్హాజరీపై కూడా స్పందించకపోవడం, నియోజకవర్గాన్ని ప్రస్తావించకపోవడం ఆసక్తికరంగా మారింది. గతంలోనూ బీజేపీ ఇక్కడ విజయం సాధించిందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఈ నియోజకవర్గాన్ని బలపరిచే అవకాశాన్ని పార్టీ వదులుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మద్దతు ఉన్నా వినియోగం లేదన్న విమర్శ
ఈ నియోజకవర్గంలో మార్వాడీలు, బ్రాహ్మణ వర్గం బీజేపీకి ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు సరిగా వినియోగించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే లేకపోయినా ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే స్థానిక నాయకత్వం కనిపించకపోవడం, ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం జరగకపోవడం ప్రజల్లో చర్చనీయాంశమైంది.
టిడిపి నేతల అసంతృప్తి
మరోవైపు, టిడిపి నేతల్లోనూ అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. పదవుల విషయంలో ఏర్పడిన పేచీల కారణంగా పలు నేతలు పార్టీకి దూరమయ్యారు. ఒకప్పుడు బుద్ధ వెంకన్న, జలీల్ ఖాన్ వంటి వారు బహిరంగ వేదికలపై పార్టీకి బలమైన గళం కల్పించినా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల తర్వాత తమను పట్టించుకోవడంలేదన్న భావనతో సైలెంట్ అయ్యారు.
ఎదురుచూస్తున్న భవిష్యత్తు
మొత్తం మీద విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో రాజకీయాలు గందరగోళంలో ఉన్నాయి. ఎమ్మెల్యే గైర్హాజరీ, బీజేపీ వైపు నుండి చైతన్యం లేకపోవడం, టిడిపి నేతల అసంతృప్తి మొత్తం కలిపి ప్రజల్లో అసహనం పెంచుతున్నాయి. కూటమి రాజకీయాలు మింగుడు పడకపోవడం వల్ల పరిస్థితి మరింత క్లిష్టతరం అవుతోంది. ఇక ముందు ముందు ఈ నియోజకవర్గ రాజకీయ దిశ ఏవైపు తిరుగుతుందన్నది చూడాల్సి ఉంది.



