విజయవాడలోని ప్రసిద్ధ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో శీనానాయక్ ప్రత్యేక ఆర్జిత సేవల టికెట్లను ఆన్లైన్లో విడుదల చేశారు. భక్తులు ప్రభుత్వ వాట్సాప్ సర్వీస్ నెంబర్ 9552300009 ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు.
ప్రత్యక్షంగా హాజరుకాలేని భక్తులకు రూ.1,500 చెల్లించి ఆన్లైన్లో ఆర్జిత సేవలు బుక్ చేసుకొని, వీడియో లింక్ ద్వారా పూజలను వీక్షించే అవకాశం కల్పించారు.
ప్రత్యేక ఆర్జిత సేవలు
ఖడ్గమాలార్చన
- సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజు ఉదయం 5 నుంచి 6 గంటల వరకు ఒక్క షిఫ్టులో నిర్వహిస్తారు.
- రుసుము: రూ.5,116.
- గమనిక: 22వ తేదీ దసరా ప్రారంభ దినం కావున ఆ రోజున ఖడ్గమాలార్చన జరగదు.
కుంకుమార్చన
- మూలా నక్షత్రం రోజున రుసుము రూ.5,000.
- మిగతా రోజులు రూ.3,000.
- దసరా ప్రారంభం రోజున ఉదయం 9 గంటల నుంచి మాత్రమే నిర్వహిస్తారు.
చండీయాగం
- ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి ఒక్క షిఫ్టులో నిర్వహిస్తారు.
- రుసుము రూ.4,000.
పూజల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో రావాలి. మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. రుసుము చెల్లించిన భక్తులకు ముఖ మండపం ద్వారా అమ్మవారి దర్శనం కల్పిస్తారు.
రవాణా సౌకర్యం
ఉదయం 3.30 నుంచి 10.30 గంటల వరకు భక్తుల కోసం ఉచిత బస్సులు నడుస్తాయి.
- బయలుదేరే ప్రదేశాలు: వన్ టౌన్ గాంధీజీ మున్సిపల్ హైస్కూల్, భవానీ ఘాట్ (గట్టు వెనుక).
- సొంత వాహనాలను ఆలయ కొండపైకి అనుమతించరు.
- వెబ్సైట్ ద్వారా కూడా పరోక్ష టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
వాట్సాప్లో టికెట్ బుకింగ్ విధానం
- 9552300009 నెంబర్కి “హాయ్” అని మెసేజ్ పంపాలి.
- “Temple Booking Services” → “Vijayawada Sri Durga Malleswara Swamy Temple” ఎంచుకోవాలి.
- దర్శనం, టెంపుల్ సేవ, డొనేషన్ ఆప్షన్లో మీకు కావలసినది సెలెక్ట్ చేసుకోవాలి.
- తెలుగు లేదా ఇంగ్లీష్ భాష ఎంచుకోవచ్చు.
- సేవ ఎంచుకున్న తర్వాత టైమ్ స్లాట్ ఫిక్స్ చేసుకోవాలి.
- హాజరయ్యే వారి సంఖ్య, ఆధార్/ఐడీ వివరాలు, గోత్రం, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
- వివరాలు సరిచూసుకొని “Confirm” నొక్కితే పేమెంట్ ఆప్షన్ వస్తుంది.
- పేమెంట్ పూర్తయిన తర్వాత వాట్సాప్ ద్వారా టికెట్ వస్తుంది → దాన్ని ప్రింట్ తీసుకోవాలి.



