అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు శుభవార్త. గత కొంత కాలంగా నిలిపివేసిన స్టూడెంట్ వీసాల జారీని అమెరికా ప్రభుత్వం మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈసారి కొన్ని కొత్త నిబంధనలు కూడా అమలులోకి తీసుకువస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
అత్యంత ముఖ్యమైన మార్పుగా, అమెరికా విదేశాంగ శాఖ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో, వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా అకౌంట్లపై పూర్తి స్థాయిలో వెట్టింగ్ (విశ్లేషణ) జరిపిన తరువాతే వీసా మంజూరు జరిగే విధంగా నిర్ణయం తీసుకుంది.
వీసాల పునరుద్ధరణ – షరతులతోనే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను గతంలో తాత్కాలికంగా నిలిపివేసిన ట్రంప్ సర్కార్, ప్రస్తుతం మళ్లీ షెడ్యూలింగ్ ప్రారంభించింది. మే నెల చివరినుంచి నిలిపివేసిన ఈ ప్రక్రియ, సోషల్ మీడియా వెట్టింగ్ కోసం తీసుకున్న వ్యూహాత్మక దశగా పేర్కొనబడింది.
ఈ నిర్ణయంతో పాటు, యూఎస్ కాన్సులేట్ అధికారులవారీగా విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లు పూర్తి స్థాయిలో పరిశీలిస్తారని ప్రకటించారు. ప్రైవేట్ సెట్టింగ్స్ను పబ్లిక్గా మార్చడం ద్వారా ఖాతాలను సమగ్రంగా పరీక్షించనున్నారు.
సోషల్ మీడియా వెట్టింగ్ అంటే ఏమిటి?
సోషల్ మీడియా వెట్టింగ్ అనేది వీసా దరఖాస్తుదారుల ఆన్లైన్ ప్రవర్తనను ఇమ్మిగ్రేషన్ అధికారులు సమీక్షించి, వారి ఉద్దేశాలు, భద్రతాపరమైన పరిగణనలు సానుకూలంగా ఉన్నాయా లేదా అనే అంశాలపై విశ్లేషణ చేయడం. ఈ ప్రక్రియలో అమెరికా వ్యతిరేక కంటెంట్, దేశ భద్రతకు ముప్పు కలిగించే లైక్స్, షేర్లు, పోస్ట్లు ఉన్నాయా అనే విషయాలను పరిశీలిస్తారు.
ఉదాహరణకు, ఎవరికైనా వారి సోషల్ మీడియా ఖాతాలో పాలస్తీనా జెండాతో కూడిన పోస్టులు కనిపిస్తే, ఆ దరఖాస్తుదారుడి సమాచారాన్ని లోతుగా పరిశీలిస్తారు. వారికి వీసా ఇచ్చే ముందు, అమెరికా భద్రతకు ముప్పుగా లేరని నిర్ధారించుకుంటారు.
విమర్శలు – కానీ అమెరికా ప్రభుత్వం స్పష్టం
ఈ నిర్ణయం కొంత మంది నిపుణుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ, అమెరికా ప్రభుత్వం మాత్రం దేశ భద్రతే తమకు ప్రథమ కర్తవ్యం అని తేల్చి చెప్పింది. విదేశీ విద్యార్థులు తమ ప్రొఫైళ్లను పునఃపరిశీలించుకుని అప్లై చేయాలనే సూచనలు చేస్తున్నారు.