తెనాలి రోడ్డులు మారబోతున్నాయి.. గుంతల నుంచి హైవే వరకూ మార్పే మార్పు! రూ.800 కోట్లతో 4 వరుసల రహదారులు!

తెనాలి:
ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తెనాలికి భారీ గిఫ్ట్ దక్కింది. పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానంలో రూ.800 కోట్ల వ్యయంతో రెండు ప్రధాన రహదారులను నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు.

ఎటు వెళ్లినా ఫాస్ట్ ట్రాక్!
తెనాలి – మంగళగిరి, తెనాలి – నారాకోడూరు రహదారులను విస్తరించేందుకు కార్యాచరణ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆ ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయని, ప్రజలకు ట్రాఫిక్ తలనొప్పులు తగ్గనున్నాయని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

శిలాఫలక ఆవిష్కరణలో కీలక వ్యాఖ్యలు
తాజాగా జరిగిన శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ – “వైసీపీ హయాంలో రహదారులు పూర్తిగా నిర్లక్ష్యం పాలయ్యాయి. గుంతలతో ప్రజలు నరకం చూస్తున్నారు. అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చి తక్కువ కాలంలోనే మార్పు తీసుకొచ్చింది” అని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లకు రీహ్యాబ్
రాష్ట్రవ్యాప్తంగా రూ.1,200 కోట్లతో ‘గుంతలు లేని రహదారులు’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు మంత్రి తెలిపారు. ముఖ్యంగా తెనాలి వాసులు గుంటూరు, విజయవాడ ప్రయాణాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇక తొలగనున్నాయని, త్వరితంగా, సురక్షితంగా ప్రయాణించేందుకు వీలవుతుందని చెప్పారు.

రైల్వేలోనూ అభివృద్ధి శకం
ఇంకా గుంటూరు జంక్షన్‌ యార్డు ఆధునికీకరణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం రూ.71.63 కోట్లను కేటాయించింది. టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఏడాదిలోగా పూర్తి చేస్తారని అంచనా. పనులు పూర్తైతే 8 ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి వస్తాయి. 24 బోగీలు నిలిపే సదుపాయం, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపే అవకాశాలు పెరుగుతాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి