తెలంగాణలో నకిలీ నోట్ల ముఠా బట్టబయలు.. రూ.42 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం

తెలంగాణలో భారీ నకిలీ కరెన్సీ గుట్టు రట్టు అయింది. హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో రూ.42 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నకిలీ కరెన్సీ సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

గుడిమల్కాపూర్ పీఎస్ ఇన్‌స్పెక్టర్ బైరి రాజు తెలిపిన వివరాల ప్రకారం, రేతిబోలి సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నకిలీ కరెన్సీ నోట్ల సరఫరా జరుగుతోందని పోలీసులకు పక్కా సమాచారం అందింది. సమాచారం మేరకు వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలతో అక్కడికి చేరుకుని ఆకస్మిక దాడులు నిర్వహించారు.

దాడుల సమయంలో నకిలీ కరెన్సీని వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొత్తం రూ.42 లక్షల విలువైన రూ.500 నోట్ల నకిలీ కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ నకిలీ కరెన్సీ వ్యవహారం వెనుక పెద్ద ముఠా ప్రమేయం ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన ముగ్గురిని విచారిస్తుండగా, మరికొందరు ఈ నేరంలో భాగస్వాములై ఉండవచ్చని ఇన్‌స్పెక్టర్ బైరి రాజు తెలిపారు. పూర్తి వివరాలను దర్యాప్తు పూర్తయ్యాక వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి