తెలంగాణ బీజేపీకి కొత్త నేత: ఫైటర్గా రాంచందర్ రావు తెరంగేట్రం
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలి ప్రసంగం నుంచే గట్టిగానే వ్యూహాలు ప్రకటించారు. “నేను మీరు అనుకునేంత సౌమ్యుడిని కాదు. విద్యార్థి దశలోనే 14 సార్లు జైలుకు వెళ్లాను,” అంటూ ఆయన మొదటి వ్యాఖ్యలే హాట్ టాపిక్ అయ్యాయి.
పార్టీలో భేదభావాలకు తావులేదు
రాంచందర్ రావు మాట్లాడుతూ, బీజేపీలో ‘కొత్త’, ‘పాత’ అనే భేదాలు లేవని స్పష్టం చేశారు. “బిడ్డ పుట్టగానే కుటుంబంలో సభ్యుడు అయినట్టే, పార్టీలో చేరిన వారందరూ మన కుటుంబ సభ్యులే,” అన్నారు. తాను పేరుకే అధ్యక్షుడని, నిజంగా కార్యకర్తను, ప్రజల సేవకుడినేనని పేర్కొన్నారు.
ఫేక్ న్యూస్కి కఠిన చర్యలు
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తూ, బీజేపీపై ట్రోలింగ్ చేస్తున్నాయని ఆరోపించారు. తాను క్రిమినల్ లాయర్ అయినందున అలా ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిని జైలుకు పంపించడంలో వెనుకాడనని హెచ్చరించారు.
ప్రజల పక్షాన పోరాటం
తాను గతంలో విద్యార్థులు, న్యాయవాదులు, పేదల తరఫున న్యాయ పోరాటం చేశానని, ఇకపై తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిరంతర పోరాటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఏబీవీపీ రోజుల నుంచి లాఠీ దెబ్బలు తినడం, అరెస్టులు ఎదుర్కోవడం వంటి అనుభవాలున్నాయని చెప్పారు.
తెలంగాణ యువతకు పిలుపు
తెలంగాణ యువత, మహిళలు బీజేపీలోకి రావాలని పిలుపునిచ్చారు. గోల్కొండ కోటపై బీజేపీ జెండా ఎగురవేసే దిశగా కలసికట్టుగా పనిచేయాలని కోరారు. పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంట్ వరకూ విజయమే లక్ష్యంగా పనిచేస్తానని ధీమా వ్యక్తం చేశారు.