తమిళనాడు శివగంగా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారైకూడి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రభుత్వ రవాణా సంస్థ (RTC) బస్సులు వేగంగా ఢీకొన్న ఈ దుర్ఘటనలో 11 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో 9 మంది మహిళలు ఉండటం విషాదాన్ని మరింత పెంచింది.
ప్రమాద తీవ్రత అంతలా ఉండటంతో రెండు బస్సులు పూర్తిగా నలిగిపోయాయి. ప్రమాదం సంభవించగానే సమీప గ్రామస్తులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీయడానికి శ్రమించారు. మరో 40 మంది వరకు గాయపడ్డారని, వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్లు సమాచారం. కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రమాదం తిరుపత్తూరు ప్రాంతంలోని పిల్లయ్రర్ పట్టి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో జరిగింది. స్థానిక పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఒక బస్సు తిరుప్పూర్ నుంచి కారైకూడి వైపు వస్తుండగా, మరొకటి కారైకూడి నుంచి దిండిగల్ దిశగా ప్రయాణిస్తుండగా ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఢీకొన్న వెంటనే ఘోర శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు సంఘటనాస్థలికి పరుగెత్తుకొచ్చారు.
ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాల రద్దీ తగ్గించేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాలు కోసం దర్యాప్తు కొనసాగుతోంది.



