రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలపై పునఃసమీక్ష జరపాలని,పంట పెట్టుబడి ఖర్చును పరిగణనలోకి తీసుకుని మద్దతు ధరలు పెంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు.
ఈ మేరకు కె.రామకృష్ణ గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వరి తోసహా 14 పంటలకు కేంద్రం మద్దతు ధరలను ప్రకటించింది.అత్యధిక విస్తీర్ణంలో పండించే ధాన్యా నికి కంటితుడుపు చర్యగా క్వింటాకు రూ.69లు మాత్రమే పెంచింది.మొక్క జొన్నకు రూ.175,కందులు రూ.450,మినుములు రూ.400,పెసలు రూ.86, వేరుశనగ రూ.480,పొద్దు తిరుగుడు రూ.441,పత్తి రూ.589 చొప్పున మద్దతు ధరలు పెంచింది.పెట్టుబడి ఖర్చులతో పోల్చుకుంటే ఈ కనీన మద్దతు ధరలు నామమాత్రమే అని ఆయన అన్నారు.ఈ మద్దతు ధరల ప్రకటన బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం మరోమారు రైతులకు అన్యాయం చేసినట్లు గోచరిస్తున్నది.ముఖ్యంగా ధాన్యం రైతులపట్ల కేంద్రం మరింత చిన్నచూపు ప్రదర్శిస్తోంది.

గత ఏడాది వరి ఒక ఎకరా సాగు ఖర్చు దాదాపు రూ.30 వేల వరకుకాగా,ఈ ఏడు విత్తనాలు,ఎరువులు, పురుగుమందులు, నూర్పిళ్లు,కూలీల వేతనాలు తదితరాలు పెరిగి ఎకరాకు రూ.40 వేల కుపైగా ఖర్చవ్వనుంది. ప్రధాన పంటలకు గత ఏడాది కంటే పంట ఉత్పత్తి ఖర్చులు 15% పెరిగాయి. గత సంవత్సరం ధాన్యానికి రూ.117లు పెంచగా, ఈ ఏడాది కేవలం రూ.69 మాత్రమే పెంచి కేంద్రం చేతులు దులుపుకుంది. ఇది రైతుల నెత్తిన పెద్ద గుదిబండ మోపడమే. పెరిగిన ఖర్చుల మేరకు కూడా మద్దతు ధరలు పెంచే పరిస్థితి లేకపోవడం విచారకరం అన్నారు.
కేంద్ర మంత్రివర్గ సమావేశం తదుపరి కేంద్రమంత్రి ప్రెస్ మీట్ లో డాక్టర్ స్వామినాథన్ కమీషన్ సిఫార్సులు అమలు చేస్తున్నట్లుగా, పంట ఉత్పత్తి ఖర్చుకు 50% కలిపి ఇస్తున్నట్లుగా అబద్ధపు ప్రకటనలు చేయడం రైతాంగాన్ని మోసగించడమే.పంట పెట్టుబడి విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో అరకొరగా మద్దతుధర ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.తక్షణమే కనీన మద్దతు ధరలపై పునఃనమీక్ష చేయాలని, రైతుల పంటల పెట్టుబడి ఖర్చును పరిగణనలోకి తీసుకుని మద్దతు ధరలను పెంచాలని డిమాండ్ చేస్తున్నాం అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.