సాధారణంగా హృదయ సంబంధ సమస్యలకు స్టెంట్ల వాడకం తెలిసిన విషయం. కానీ ఇప్పుడు స్ట్రోక్ (పక్షవాతం) బాధితుల కోసం కూడా స్టెంట్ చికిత్సా ఎంపిక అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్ నిపుణుల ప్రకారం, ‘సూపర్నోవా స్టెంట్’ అనే ఆధునిక వైద్య పరికరం స్ట్రోక్ చికిత్సలో సురక్షితంగా, అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని శనివారం వెల్లడించారు. దేశంలోని మొట్టమొదటి ఈ క్లినికల్ ట్రయల్ను ఎయిమ్స్ నేతృత్వంలో నిర్వహించారు.
‘గ్రాస్రూట్’ పేరుతో ఎనిమిది కేంద్రాల్లో జరిగిన ఈ ట్రయల్కు ఎయిమ్స్ ఢిల్లీ జాతీయ సమన్వయ కేంద్రంగా వ్యవహరించింది. “భారతదేశంలో స్ట్రోక్ చికిత్సలో ఇది మైలురాయి. తీవ్రమైన పక్షవాతం కేసుల్లో సూపర్నోవా స్టెంట్ అద్భుతమైన భద్రత మరియు సామర్థ్యాన్ని నిరూపించింది” అని ఎయిమ్స్ న్యూరోఇమేజింగ్ విభాగాధిపతి, ట్రయల్ నేషనల్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ శైలేష్ బి. గైక్వాడ్ తెలిపారు. ట్రయల్ ఫలితాలు ‘జర్నల్ ఆఫ్ న్యూరోఇంటర్వెన్షనల్ సర్జరీ’లో ప్రచురితమయ్యాయి.
ఈ ట్రయల్లో భాగంగా, రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించే థ్రాంబెక్టమీ ప్రక్రియలో సూపర్నోవా స్టెంట్ వాడబడింది. ఫలితంగా మెదడులో రక్తప్రవాహం విజయవంతంగా పునరుద్ధరించబడింది. రక్తస్రావం రేటు 3.1 శాతం, మరణాల రేటు 9.4 శాతం మాత్రమే నమోదయి, చికిత్స పొందిన రోగులలో సగం 90 రోజుల్లో సాధారణ జీవనశైలికి చేరుకున్నారు.
గ్రావిటీ మెడికల్ టెక్నాలజీ సంస్థ ‘మేక్-ఇన్-ఇండియా’ భాగంగా అభివృద్ధి చేసిన ఈ స్టెంట్ భారతీయ రోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. గ్రాస్రూట్ ట్రయల్ డేటా ఆధారంగా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఇప్పటికే దీని వినియోగానికి ఆమోదం ఇచ్చింది. “ఇప్పటి వరకు ఆగ్నేయాసియాలో 300 మంది రోగులను ఈ పరికరంతో చికిత్స చేశాం. ఇప్పుడు భారతదేశంలో తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది. ఏటా పక్షవాతం బారిన పడే 17 లక్షల మంది భారతీయులకు ఇది కొత్త ఆశను అందిస్తుంది” అని మయామీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ దిలీప్ యవగళ్ తెలిపారు.



