ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. రూ.52 కోట్ల వ్యయంతో “పెయ్య సాయం” అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా కేవలం ఆడ దూడలే పుట్టేలా చర్యలు తీసుకొని, పాల ఉత్పత్తిని పెంచడమే కాకుండా రాష్ట్రంలో పశు సంపదను సమృద్ధిగా పెంచే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.
ఈ ప్రాజెక్టును చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించారు. నియోజకవర్గంలోని ప్రతి పాడి రైతు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా మారేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. జాతీయ పాడి అభివృద్ధి మండలి, రాష్ట్ర పశుసంవర్థక శాఖ, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థలు కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.
ప్రస్తుతం కుప్పం జిల్లాలో రోజువారీ పాల ఉత్పత్తి 4.5 లక్షల లీటర్లుగా ఉంది. రాబోయే నాలుగేళ్లలో ఈ ఉత్పత్తిని 10 లక్షల లీటర్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఆధునిక సాంకేతికతతో ఆడ దూడల ఉత్పత్తికి చర్యలు
పెయ్య సాయం పథకం కింద మగ దూడల పుట్టుకను తగ్గించడమే కాకుండా, ఆడ దూడలే పుట్టేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. వీర్యంలోని క్రోమోజోములను వేరు చేసి, ఆడదూడలకు అనుకూలమైన వీర్యాన్ని తయారుచేస్తున్నారు. ఈ విధానం ద్వారా సుమారు 90 శాతానికి పైగా ఆడ దూడలే జన్మిస్తున్నాయని అధికారులు తెలిపారు.
ప్రతి డోసు వీర్య ధరను రూ.1600గా నిర్ణయించారు. దేశవాళీ జాతులైన సాహివాల్, హెచ్ఎఫ్, జెర్సీ, గిర్ వంటి వాటితో పాటు హెచ్ఎఫ్ సంకర జాతులలోనూ లింగ నిర్ధారిత వీర్యం వినియోగిస్తున్నారు.
లక్ష్యం – 55 వేల పశువులకు సేవ
కుప్పం నియోజకవర్గంలో ప్రస్తుతం పునరుత్పత్తికి అనుకూలంగా ఉన్న ఆవులు 80 వేల వరకు ఉన్నాయని గుర్తించారు. తొలి ఏడాదిలోనే 55 వేల పశువులకు లింగ నిర్ధారిత వీర్యాన్ని అందించాలనే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే సుమారు 8,900 పశువులకు కృత్రిమ గర్భధారణ నిర్వహించారని సమాచారం.
ఆవుల ఎదకు వచ్చే సమయంలో కృత్రిమ గర్భధారణ చేపట్టి, ప్రతీ పాడి రైతు ఇంట ఆడ దూడలు జన్మించేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పని చేస్తోంది. దీని ద్వారా రాష్ట్రంలో పాల ఉత్పత్తి, పశు సంపద రెండూ గణనీయంగా పెరుగుతాయని అధికారులు తెలిపారు. రైతులూ ఈ కార్యక్రమంపై విశేష ఆసక్తి చూపుతున్నారు.