ప్రకాశం జిల్లా పొదిలిలో మరోసారి స్వల్ప భూకంపం నమోదై స్థానికులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. డిసెంబర్ 5, 2025 తెల్లవారుజామున 3.14 గంటల సమయంలో భూమి కొన్ని క్షణాలు కంపించడంతో ప్రజలు గాబరాగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఈ భూకంపం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కొద్దిసేపటికే కంపనలు ఆగిపోవడంతో పొదిలి ప్రజలు ఊపిరి పీల్చుకున్నా, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదని స్పష్టం చేస్తూ, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. భూకంప తీవ్రత, దాని మూల కారణాలపై క్లారిటీ కోసం భౌగోళిక నిపుణులకు సమాచారం పంపినట్లు అధికారులు వెల్లడించారు. అవసరమైతే ప్రాంతంలో మరింత లోతైన సర్వే నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపింది. పుకార్లు ప్రచారం చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మే 6న కూడా ఇదే ప్రాంతంలో భూప్రకంపనలు
ఇది పొదిలి మొదటిసారి అనుభవించిన భూకంపం కాదు. మే 6, 2025 ఉదయం 9.54 గంటలకు కూడా ఇదే ప్రాంతంలో స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. ఆ సమయంలో భూమి దాదాపు ఐదు సెకన్లపాటు కంపించిందని స్థానికులు గుర్తుచేసుకున్నారు. కొత్తూరు బ్యాంక్ కాలనీ, రాజు ఆసుపత్రి వీధి, ఇస్లాంపేట తదితర ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అప్పుడు కూడా ఎటువంటి నష్టం చోటుచేసుకోలేదు.
సుమారు ఏడు నెలల వ్యవధిలో రెండు సార్లు భూప్రకంపనలు రావడంతో స్థానికుల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ వరుస భూకంపాలకు కారణాలు ఏమిటో తెలియక ప్రజలు అయోమయం చెందుతున్నారు. భూగర్భ మార్పులా? భూగర్భ జలాల మార్పులా? లేక ప్రాంతీయ ఫాల్ట్లైన్ల కారణమా? అనే అంశాలపై నిపుణుల వివరణ కోసం పొదిలి వాసులు ఎదురు చూస్తున్నారు.
ప్రజలకు సూచనలు – జాగ్రత్తలు తప్పనిసరి
భూకంప సమయంలో పాటించాల్సిన ముఖ్య సూచనలు:
- ఇళ్లలో భారీ అల్మారాలు, ఫ్రిజ్లు, నీటి డ్రములు వంటి పడిపోవచ్చు ప్రమాదం ఉన్న వస్తువులకు దూరంగా ఉండాలి.
- బయటకు వెళ్లే మార్గాలు అడ్డం లేకుండా చూసుకోవాలి.
- భూకంపం సమయంలో లిఫ్ట్లు ఉపయోగించకూడదు.
- పిల్లలు, వృద్ధులను వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలించాలి.
- ఇంట్లో ఉంటే గోడ మూలల్లో లేదా టేబుల్ క్రింద కూర్చోవడం మంచిది.



