దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది ఈపీఎఫ్వో (ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ) సభ్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. పీఎఫ్ ఖాతా నుంచి నగదు ఉపసంహరణను మరింత సులభంగా, వేగంగా జరిగేలా చేయడమే లక్ష్యంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ద్వారా పీఎఫ్ డబ్బులను నేరుగా సభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం పీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే క్లెయిమ్ ఫారమ్లను సమర్పించి, ప్రాసెసింగ్ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రక్రియకు కొన్ని రోజుల సమయం పడుతోంది. అయితే కొత్త విధానం అమల్లోకి వస్తే, సభ్యులు తమ పీఎఫ్కు లింక్ అయిన బ్యాంకు ఖాతాకు యూపీఐ పిన్ ఉపయోగించి నేరుగా, క్షణాల్లోనే నగదు బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఈపీఎఫ్వో ఇప్పటికే అవసరమైన సాఫ్ట్వేర్ మార్పులు, సాంకేతిక అప్డేట్స్ చేపడుతోంది.
ఇప్పటికే ఆటో-సెటిల్మెంట్ విధానంలో అనారోగ్యం, విద్య, వివాహం, గృహ నిర్మాణం వంటి అవసరాల కోసం చేసే పీఎఫ్ క్లెయిమ్లను కేవలం మూడు రోజుల్లోనే పరిష్కరిస్తున్నారు. ఈ ఆటో సెటిల్మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పాక్షిక ఉపసంహరణ నిబంధనలను కూడా మరింత సరళీకరించారు. గతంలో అమల్లో ఉన్న 13 సంక్లిష్ట నియమాలను తొలగించి, వాటిని మూడు సులభమైన కేటగిరీలుగా మార్చారు.
కొత్త నిబంధనల ప్రకారం, సభ్యులు తమ పీఎఫ్ ఖాతాలో అర్హత ఉన్న బ్యాలెన్స్లో 100 శాతం వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, పీఎఫ్పై లభించే చక్రవడ్డీ ప్రయోజనాలు, ప్రస్తుతం అమలులో ఉన్న 8.25 శాతం వడ్డీ రేటును కోల్పోకుండా ఉండాలంటే ఖాతాలో కనీసం 25 శాతం మొత్తాన్ని కొనసాగించడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
యూపీఐ ఆధారిత సేవలు అమల్లోకి వస్తే ఈపీఎఫ్వో సేవలు బ్యాంకింగ్ స్థాయికి చేరుతాయని, ఏటా వచ్చే 5 కోట్లకు పైగా పీఎఫ్ క్లెయిమ్ల ప్రాసెసింగ్ భారం గణనీయంగా తగ్గుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో సభ్యులకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందే అవకాశాలు మరింత పెరుగనున్నాయి.



