ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తమిళనాడు పర్యటనకు వెళ్లారు. మధురైలో నిర్వహించిన మురుగన్ భక్తుల సదస్సులో పాల్గొనడానికి అక్కడికి వెళ్లిన ఆయన, డీఎంకే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కఠిన విమర్శలు గుప్పించారు.
ఈ కార్యక్రమం మతపరమైనదే అయినా, రాజకీయ విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ – “ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు, ముస్లిం తన మతాన్ని గౌరవించవచ్చు. కానీ హిందువు తన మతాన్ని గౌరవిస్తే మాత్రం ఎందుకు అభ్యంతరం?” అని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని విమర్శించే వైఖరిపై తీవ్రంగా స్పందించిన పవన్, మురుగన్ నామస్మరణ శక్తిని గుర్తుచేస్తూ హిందూ ఆధ్యాత్మికతను సమర్థించారు.
డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించిన పవన్, ఆ పార్టీ వైఖరిపై సూటిగా విరుచుకుపడ్డారు.
ఈ వ్యాఖ్యలపై డీఎంకే మంత్రి శేఖర్ బాబు స్పందించారు. పవన్ కళ్యాణ్కు తమిళనాడుతో ఏమాత్రం సంబంధం లేదని వ్యాఖ్యానించిన ఆయన, “తమిళ ప్రజల సమస్యలపై మాట్లాడే అర్హత ఆయనకు లేదు. బీజేపీకి అనుకూలంగా మత రాజకీయాలు నడపొద్దు” అని హెచ్చరించారు. తమ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
పైగా, “చెన్నైలో ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి చూపిస్తే కానీ పవన్ మాటలకు విలువ ఉంటుంది” అంటూ శేఖర్ బాబు పరోక్ష సవాల్ విసిరారు.