వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. టోల్ చెల్లింపులను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పాస్ను ఆగస్ట్ 15 నుండి అందుబాటులోకి తీసుకురానున్నారు. రూ.3,000 చెల్లించి ఈ సౌకర్యాన్ని ఏటా వినియోగించుకోవచ్చు.
ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, ఈ నిర్ణయం దేశ రహదారి వ్యవస్థకు గేమ్ ఛేంజర్గా నిలవనుందని అన్నారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన కార్యాలయం ద్వారా విడుదల చేసిన ట్వీట్లో, “ఈ విధానంతో టోల్ ప్లాజాల వద్ద సమయనష్టం తగ్గుతుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి తరచూ ప్రయాణించే వాహనదారులకు ఇది ఎంతో ఉపశమనం కలిగించనుంది” అని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “రూ. 3,000 ఫాస్టాగ్ పాస్ కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు. ఇది దేశవ్యాప్తంగా వేగవంతమైన, వివాదాల్లేని హైవే ప్రయాణం వైపు కీలక ముందడుగు. ముఖ్యంగా టోల్ గేట్ల సమీప ప్రాంతాల్లో నివసించే వారికి ఇది అనేక రకాల ప్రయోజనాలను అందించనుంది,” అన్నారు.
ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ప్రజా-కేంద్రీకృత పాలనకు ప్రత్యక్ష ఉదాహరణ అని కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
గడ్కరీ ప్రకారం, ఈ ఫాస్టాగ్ పాస్ జీపులు, కార్లు, వ్యాన్లు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకు వర్తించనుంది. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ను తగ్గించడంతో పాటు, లక్షలాది ప్రయివేట్ వాహనదారులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం అందించడమే ఈ పాస్ లక్ష్యం.