ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల మధ్య ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రం “ఆపరేషన్ సింధు” పేరిట ప్రత్యేక మిషన్ను ప్రారంభించింది.
ఈ చర్యల భాగంగా, టెహ్రాన్లో నివసిస్తున్న 110 మంది భారత విద్యార్థులు ఆర్మేనియా మీదుగా ప్రత్యేక విమానంలో భారత్కి తరలించబడ్డారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు గురువారం ఆ విమానం చేరింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో, ఈ తరలింపు మిషన్ భారత రాయబార కార్యాలయ సమన్వయంతో జరిగిందని, భద్రతా కారణాల దృష్ట్యా విద్యార్థులను ముందస్తు ఏర్పాట్లతో టెహ్రాన్ నుంచి తీసుకువచ్చినట్లు తెలిపింది.
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తన ఎక్స్ అకౌంట్లో ఈ విషయాలను వెల్లడిస్తూ, జూన్ 17న ఉత్తర ఇరాన్ నుంచి ఆర్మేనియాకు తరలించిన విద్యార్థులు, జూన్ 18న ప్రత్యేక విమానంలో బయలుదేరి, జూన్ 19 తెల్లవారుజామున భారత్కి చేరినట్లు పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఇక, ఈ మిషన్కి సహకరించిన ఇరాన్ మరియు ఆర్మేనియా ప్రభుత్వాలకు భారత అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు భారత రాయబార కార్యాలయం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అలాగే, మిగిలి ఉన్న పౌరులను అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా భారత్కు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సూచన: ఇరాన్లో ఉన్న భారతీయులు తక్షణమే టెహ్రాన్లోని రాయబార కార్యాలయం లేదా న్యూఢిల్లీలోని విదేశాంగ శాఖ కంట్రోల్ రూమ్తో సంప్రదించవలసిందిగా సూచించారు.