గద్వాలలో పెళ్లైన నెలకే నవవరుడు హత్య: మేఘాలయ హనీమూన్ కేసుకు ప్రతిరూపం

జోగులాంబ గద్వాల జిల్లాలో మేఘాలయ హనీమూన్ హత్య కేసును తలపించేలా ఒక అమానుష ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన కేవలం నెల రోజుల్లోనే అదృశ్యమైన యువకుడు ఐదు రోజుల తర్వాత శవమై కనిపించడం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

గద్వాల పట్టణంలోని గంట వీధికి చెందిన తేజేశ్వర్ అనే యువకుడు, లైసెన్స్ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. మే 18న కర్నూలు జిల్లాకు చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, ఇది ఇష్టపూర్వక వివాహమే. కానీ పెళ్లైన నెల కూడా కాకముందే తేజేశ్వర్ అదృశ్యమయ్యాడు. జూన్ 17న నుంచి అతను కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు ప్రారంభించి, చివరికి నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలోని పిన్నాపురం శివారులో అతని మృతదేహాన్ని గుర్తించారు.

శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శవంపై ఉన్న గాయాల ప్రకారం ఇది హత్య అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ ఘటనతో తేజేశ్వర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు, బంధువులు తేజేశ్వర్ మరణం వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. భార్యపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాహానికి ముందు ఆమెకు ఇతర సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయని, వాటినే ఈ దారుణానికి కారణంగా పేర్కొంటున్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి హత్య వెనుక ఉన్న నిజాలను వెలికి తీయడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

ఈ సంఘటన మేఘాలయలో జరిగిన హనీమూన్ హత్య కేసును తీవ్రంగా గుర్తు చేస్తోంది. అక్కడ భర్తను ప్రియుడి సహాయంతో హతమార్చిన ఘోరం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఇప్పుడీ గద్వాల ఘటన అదే రీతిలో జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి