అమరావతి, జూన్ 16:
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైల్వే కనెక్టివిటీ పెంపు దిశగా కీలక అడుగులు వేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. గుంటూరు పరిసర ప్రాంతాల్లో రైళ్ల రద్దీని తగ్గించేందుకు పేరేచర్ల-మంగళగిరి మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి భారీ ప్రణాళికలు రూపొందించబడ్డాయి. ఈ ప్రాజెక్టు ఖర్చు రూ.2 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ప్రస్తుతం ఈ రూట్కు సంబంధించిన సర్వే తుదిదశలో ఉంది. డీపీఆర్ తయారీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం. సర్వే పూర్తయిన వెంటనే దక్షిణ మధ్య రైల్వే పరిశీలించి, రైల్వే బోర్డుకు ఆమోదానికి పంపనున్నారు.
ఈ కొత్త మార్గం ద్వారా ప్రయాణికుల రైళ్లపై ఉన్న ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా, సరకు రవాణా కోసం ప్రత్యేక ఫ్రైట్ కారిడార్ను కూడా ప్రతిపాదించారు. ప్రస్తుతం సరకు రవాణా కూడా ప్రయాణికుల ట్రాక్ల మీదే జరుగుతుండటంతో భారీ రద్దీ, నెమ్మదితనంతో సమస్యలు తలెత్తుతున్నాయి.
ప్రత్యేక ప్రయోజనాలు:
- పేరేచర్ల నుంచి పొన్నెకల్లు మీదుగా మంగళగిరి వరకు ప్రత్యేక రైలు మార్గం
- నరసరావుపేట గుంతకల్ మార్గం ద్వారా గుంటూరు వచ్చే సరుకు రైళ్లకు ప్రత్యామ్నాయ మార్గం
- విజయవాడ నుంచి వచ్చే రైళ్లు మంగళగిరి మీదుగా పేరేచర్లకి నేరుగా చేరే అవకాశాలు
- నల్లపాడు-బీబీనగర్ మార్గం వద్ద ఆర్వోఆర్ వంతెన నిర్మాణం ప్రతిపాదనలో
ఈ మొత్తం ప్రణాళిక అమలవుతే, పేరేచర్ల-గుంటూరు-మంగళగిరి మధ్య ట్రాఫిక్ లోడ్ తగ్గుతుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. అమరావతికి మరింత బలమైన కనెక్టివిటీ కోసం ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.