ఏపీలో మోంతా తుపాను తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో, రాష్ట్ర పరిస్థితులపై కేంద్రం కూడా నిశితంగా గమనిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర రైల్వే, సమాచార సాంకేతిక మంత్రి అశ్వినీ వైష్ణవ్ సీఎం చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి, తుపాను పరిస్థితులపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక చర్యలపై, విద్యుత్-సంబంధిత సమస్యల పరిష్కారంపై కూడా ఆరా తీశారు.
ఇక సీఎం చంద్రబాబు కూడా ఉదయం నుంచే వరుస సమీక్షల్లో బిజీగా ఉన్నారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి రెండు సార్లు, టెలీకాన్ఫరెన్స్ ద్వారా మరో రెండు సార్లు అధికారులతో పరిస్థితులు సమీక్షించారు. ప్రతి జిల్లా కలెక్టర్, ఎస్పీ, విద్యుత్, రవాణా, వ్యవసాయ శాఖల అధికారుల నుంచి స్థితిగతులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో సహాయక బృందాలు సిద్దంగా ఉండాలని, విద్యుత్ అంతరాయాలు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపు
మోంతా తుపాను ప్రభావం కొనసాగుతుండటంతో, ఏపీలో పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు పొడిగించారు. పలు జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే సంబంధిత ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
వర్షానికి ప్రకాశం, ఒంగోలు జిల్లాలు అతలాకుతలం
ప్రకాశం జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ నీటమునిగింది. మరో ఘటనలో ఒంగోలు సమీపంలో కారు వాగులో కొట్టుకుపోయింది, అయితే స్థానికులు వెంటనే స్పందించి డ్రైవర్ను సురక్షితంగా రక్షించారు. వర్షాలు కారణంగా ప్రకాశం, ఒంగోలు ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్స్ దెబ్బతిన్నాయి, నెట్వర్క్ సౌకర్యాలు సరిగా పనిచేయడం లేదు. అదే విధంగా కైకలూరులో కూడా కుండపోత వర్షం కొనసాగుతోంది.
విద్యార్థులకు విద్యుత్ షాక్ – గుర్లలో కలకలం
విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని కస్తూరిబా పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ వైర్లు తెగిపడటంతో గోడను పట్టుకున్న 30 మంది బాలికలకు కరెంట్ షాక్ తగిలింది. వీరిలో ఐదుగురు తీవ్రంగా గాయపడి స్పృహ తప్పారు. వారిని వెంటనే విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారులు అక్కడే సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
బస్సు సర్వీసులు రద్దు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో, 170 ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా జిల్లా నుంచి హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం వైపు వెళ్లే సర్వీసులను రద్దు చేశారు. తుపాను ప్రభావం తగ్గేవరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.
మొత్తం మీద ఏపీలో మోంతా తుపాను ఉద్ధృతం కొనసాగుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం రెండూ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు.



