ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే పరీక్షల నిర్వహణ, కీ విడుదల పూర్తవ్వగా, ఇప్పుడు తదుపరి దశలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెరిట్ లిస్ట్ రేపు (బుధవారం) విడుదలయ్యే అవకాశం ఉంది.
అభ్యర్థుల జాబితా విడుదల
పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే టెట్ మార్కుల సవరణకు సంబంధించిన అభ్యంతరాలను పరిశీలించింది. అలాగే క్రీడల కోటా కేటగిరీలో ఎంపికైన వారి జాబితా కూడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా ఈ జాబితా అంటే ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాగా భావించవచ్చు.
మొత్తం ఖాళీలు – అభ్యర్థుల ఎంపిక
ఈ మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. అంతే సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచే అవకాశం ఉంది. వారిలో ఎవరి సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే, ఆ స్థానంలో తదుపరి మెరిట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులను పిలుస్తారు.
తుది జాబితా విడుదల
సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యాకే తుది నియామక జాబితా విడుదల కానుంది. అయితే రేపు వెలువడే జాబితా ద్వారా ఎవరు ఉద్యోగాలకు అర్హులయ్యారనే అంశంపై స్పష్టత లభించనుంది. కానీ అధికారులు మాత్రం ఇది తుది జాబితా కాదని, కేవలం సర్టిఫికెట్ వెరిఫికేషన్ జాబితా మాత్రమేనని తెలిపారు.
జిల్లాల వారీగా లిస్టులు
జిల్లాల వారీగా అభ్యర్థుల జాబితాలను విడుదల చేసి, ఎంపికైన వారికి సర్టిఫికెట్ల పరిశీలన కోసం కాల్ లెటర్స్ పంపనున్నారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తి చేసి, రెండో వారంలో పోస్టింగ్లు ఇవ్వాలని విద్యాశాఖ యోచిస్తోంది.
👉 ఈ ప్రక్రియ పూర్తి కాగానే, వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి.



