హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలతో ముగిసింది. రాష్ట్ర అభివృద్ధి, పారదర్శక పాలన, రైతు సంక్షేమం, యువత ప్రోత్సాహం వంటి అంశాలపై మంత్రివర్గం దృష్టి సారించింది. నాలుగు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు.
రీజనల్ రింగ్ రోడ్డుకు ఆమోదం
హైదరాబాద్ చుట్టూ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, నగర విస్తరణకు దోహదపడే రీజనల్ రింగ్ రోడ్డు (దక్షిణ భాగం) ఆకృతికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు నగరానికి సమర్థవంతమైన రవాణా మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా, పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి బలమైన పునాది వేస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక
గత ప్రభుత్వం కాలంలో నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ లేఖ నేపథ్యంలో, ప్రాజెక్టుకు మంత్రివర్గ ఆమోదం ఉందా అనే అంశాన్ని స్పష్టతచేయాలని నిర్ణయించారు. జూలై 30వ తేదీలోగా కమిషన్కు పూర్తి సమాచారం, మినిట్స్తో సహా నివేదికను సమర్పించాలని క్యాబినెట్ తీర్మానం చేసింది.
రైతు నేస్తం సభ.. రైతులకు భరోసా
రైతుల సంక్షేమానికి అంకితమై ఉన్న ప్రభుత్వం, రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు సచివాలయం ఎదురుగా “రైతు నేస్తం సభ” నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఆమోదించింది. అదనంగా, ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
క్రీడా విధానానికి గ్రీన్ సిగ్నల్
నూతన క్రీడా విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్రీడల్లో ప్రతిభ చూపుతున్న యువతకు శిక్షణ, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు దిశగా ఇది కీలక ముందడుగు.
తెలంగాణ తల్లి విగ్రహాలకు నిర్ణయం
ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాలను (కొత్త నమూనా) ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇది రాష్ట్ర గౌరవాన్ని, సాంస్కృతిక భావాన్ని ప్రతిబింబించేందుకు దోహదపడనుంది.
హుజూరాబాద్ న్యాయ కళాశాలలో అడ్మిషన్లు
హుజూరాబాద్లో నూతన న్యాయ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది స్థానిక విద్యాభివృద్ధికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
పెండింగ్ బిల్లులపై చర్చ
సమావేశంలో అన్ని శాఖల పెండింగ్ బిల్లులపై సమీక్ష నిర్వహించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు.