మంచిర్యాలలో జూనియర్ కాలేజీ కుంభకోణం: రూ.8 కోట్లు అప్పుతో చైర్మన్ పరార్

మంచిర్యాల: మంచిర్యాల పట్టణంలో ఉన్న ఓ ప్రముఖ ప్రైవేట్ జూనియర్ కాలేజీ చైర్మన్ రూ.8 కోట్ల మేర అప్పులు చేసి, కుటుంబంతో సహా రాత్రికి రాత్రే పరారైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనతో కళాశాలలో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అప్పు ఇచ్చిన వ్యక్తులు, ఉద్యోగులు కూడా తీవ్రంగా నష్టపోయారు.

వివరాల్లోకి వెళితే, కాలేజీ చైర్మన్ వివిధ వ్యక్తుల నుండి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని, అకస్మాత్తుగా కాలేజీ కార్యకలాపాలను నిలిపివేశాడు. అనంతరం కుటుంబంతో కలిసి ఎటు వెళ్లిపోయాడో తెలియని పరిస్థితి ఏర్పడింది. చైర్మన్ పరారైన వెంటనే, కాలేజీ భవనాన్ని మధ్యవర్తుల సహాయంతో రహస్యంగా విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇంతకుముందు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కొందరు ఏజెంట్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు చర్యలకు దిగారు. ఇప్పటికే కొన్ని మంది ముళ్లపట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు చైర్మన్ ఆచూకీ, ఆర్థిక లావాదేవీలు, భవనం విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇక విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి సర్టిఫికెట్లను తిరిగి ఇప్పించడంతో పాటు, ఇతర కాలేజీల్లో వారికి ప్రవేశాల కల్పనపై విద్యాశాఖను కోరుతున్నారు. ఇప్పటికే ఇన్‌ఛార్జ్ డీఐఈఓ అంజయ్య కాలేజీ భవనానికి నోటీసులు జారీ చేసి, ఇంటర్మీడియట్ బోర్డుకు నివేదిక పంపారు.

బాధిత విద్యార్థులు, అప్పులందించిన వ్యక్తులు కాలేజీ చైర్మన్‌పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకుని, విద్యాశాఖను తక్షణ జోక్యం చేసుకోవాలని కోరుతున్నాయి. విద్యార్థుల భద్రత, భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం దీర్ఘకాలిక పర్యవేక్షణ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి