న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా మిషన్ను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే దిశగా భారత రైల్వే శాఖ మరో కీలక అడుగు వేసింది. దేశంలోని ప్రధాన, ఉపరైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు మరింత వేగవంతమైన హైస్పీడ్ వై-ఫై (Wi-Fi) సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా మొత్తం 6,115 రైల్వే స్టేషన్లలో ఇప్పుడు హైస్పీడ్ ఉచిత Wi-Fi సదుపాయం అందుబాటులో ఉంది.
ప్రధాన నగరాలు సహా చిన్న స్టేషన్లలో కూడా సేవలు
న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబయి, కాచిగూడ, సికింద్రాబాద్ వంటి ప్రధాన నగరాల స్టేషన్లు మాత్రమే కాకుండా, చిన్న పట్టణాల స్టేషన్లలో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉందని ఆయన రాజ్యసభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ సర్వీస్ రైల్వే సహకార సంస్థ ‘రైల్టెల్’ ద్వారా అందించబడుతోంది.
ప్రయాణికులకు లభించే ప్రయోజనాలు
ఈ హైస్పీడ్ Wi-Fi ద్వారా ప్రయాణికులు:
- సినిమాలు, పాటలు, వీడియోలు, గేమ్స్ వేగంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు
- అత్యవసర పరిస్థితుల్లో స్టేషన్ పరిసరాల్లోనే ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకోవచ్చు
- ఆన్లైన్ మీటింగ్లు, ఫైల్ షేరింగ్ వంటి పనులను కూడా సులభంగా చేయవచ్చు
ఉచిత Wi-Fi ఎలా కనెక్ట్ చేసుకోవాలి?
- మీ స్మార్ట్ఫోన్లో Wi-Fi మోడ్ను ఆన్ చేయండి
- అందులో కనిపించే ‘RailWire Wi-Fi’ నెట్వర్క్ను ఎంచుకోండి
- మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి
- SMS ద్వారా మీ ఫోన్కు వన్టైమ్ పాస్వర్డ్ (OTP) వస్తుంది
- ఆ OTPని నమోదు చేయగానే మీ ఫోన్లో హైస్పీడ్ Wi-Fi కనెక్ట్ అవుతుంది
డిజిటల్ కనెక్టివిటీ విస్తరణ
డిజిటల్ ఇండియా మిషన్ లక్ష్యం దేశంలోని ప్రతి పౌరునికి వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం అందించడమే. రైల్వే స్టేషన్లలో ఉచిత Wi-Fi అందించడం ద్వారా పల్లెల నుండి మెట్రో నగరాల వరకు అందరికీ సమాన డిజిటల్ అవకాశాలు కల్పించడమే రైల్వే లక్ష్యం.



