ఒకప్పుడు కరోనా ముందు వరుసలో ఉన్న మహమ్మారిగా క్యాన్సర్ను పేర్కొనేవారు. ‘క్యాన్సర్’ అనే మాట వినగానేనే గుండెల్లో దడ మొదలయ్యేది. క్యాన్సర్ వచ్చిందంటే ఇక జీవితం ముగిసినట్టేనన్న భయం ప్రజల్లో బలంగా ఉండేది. అప్పట్లో అరుదుగా ఎవరికో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి వచ్చేది.
కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాలతో బీపీ, షుగర్ వచ్చినట్లుగానే క్యాన్సర్ కూడా సాధారణంగా మారిపోతోంది. అదే సమయంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. అధునాతన సాంకేతికత, మెరుగైన చికిత్స విధానాల వల్ల క్యాన్సర్ చికిత్స ఇప్పుడు చాలా మందికి అందుబాటులోకి వచ్చింది.
భారతదేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయంటే అందుకు ఎరువులు, పురుగుమందులు వాడిన కూరగాయలు, కాలుష్యం, కార్బైడ్తో పండించిన పండ్లు, నీటి కాలుష్యం, సిగరెట్లు, మద్యం వంటి కారణాలను సాధారణంగా చెబుతుంటారు. ఇవన్నీ క్యాన్సర్కు కారణాలు కావచ్చని వైద్య నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. అయితే ఇవి మాత్రమే ప్రధాన కారణాలు కావని ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు స్పష్టంగా చెబుతున్నారు.
ప్రజలు రోజూ అనుకోకుండా చేసే కొన్ని చిన్న తప్పులే క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరగడానికి అసలు కారణమని ఆయన తన యూట్యూబ్ ఛానెల్లో వెల్లడించారు.
ఈ 5 చిన్న అలవాట్లే క్యాన్సర్కు దారి
1. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం
చాలామంది రాత్రి 9 లేదా 10 గంటల తర్వాత భోజనం చేసే అలవాటు కలిగి ఉంటారు. ఇదే క్యాన్సర్కు అత్యంత ప్రమాదకరమైన కారణమని డాక్టర్ మంతెన చెబుతున్నారు. రాత్రిపూట శరీరం సహజంగా ‘రిపేర్’ మరియు ‘క్లీనింగ్’ ప్రక్రియలు జరుపుకోవాలి. కానీ ఆలస్యంగా తినడం వల్ల ఈ ప్రక్రియలు సరిగా జరగవు. ఫలితంగా కణాల్లో మలినాలు పెరిగి, వాపు ఏర్పడి, మంచి కణాలు కూడా క్యాన్సర్ కణాలుగా మారే ప్రమాదం ఉంటుందని ఆయన హెచ్చరిస్తున్నారు. రాత్రి ఆలస్యంగా తినే అలవాటు మొత్తం శరీర ఆరోగ్య వ్యవస్థనే దెబ్బతీస్తుందని చెప్పారు.
2. పోషకాలు లేని ఆహారం
ఆహారంలో సరైన పోషకాలు లేకపోతే లివర్ శుభ్రపడదు, శరీర రక్షణ వ్యవస్థ బలహీనమవుతుంది. మంచి కణాలు క్యాన్సర్ కణాలుగా మారకుండా కాపాడే కొన్ని ముఖ్యమైన ఎంజైమ్స్, హార్మోన్స్ అవసరం. ఇవి ఇమ్యూనిటీ వ్యవస్థలో, లివర్లో ఉత్పత్తి కావాలంటే సరైన పోషకాలు తప్పనిసరిగా ఉండాలని ఆయన తెలిపారు.
3. అధికంగా వేయించిన, వేడిచేసిన ఆహారం
నూనెలో బాగా వేయించిన పదార్థాలు, ఓవెన్లో అధికంగా వేడి చేసిన ఆహారం, నిత్యం నెయ్యి ఎక్కువగా వాడిన వంటకాలు తినడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. ఇవన్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని డాక్టర్ మంతెన స్పష్టం చేశారు.
4. కృత్రిమ పదార్థాలతో తయారైన ప్యాకేజ్డ్ ఫుడ్
కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ కలిపిన రెడీమేడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ వినియోగం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది. ఇది క్యాన్సర్కు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారుతోందని ఆయన అన్నారు. “విదేశాల్లో కూడా ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువగా తింటారు కదా, మరి వాళ్లకు ఎందుకు క్యాన్సర్ రాదు?” అనే సందేహం చాలామందికి ఉంటుందని చెప్పారు.
5. మంచి ఆహారం లోపించడం
వాస్తవానికి విదేశాల్లో కూడా క్యాన్సర్ కేసులు ఎక్కువగానే ఉన్నాయని డాక్టర్ మంతెన తెలిపారు. అయితే అక్కడి ప్రజలు చెడు ఆహారంతో పాటు మంచి ఆహారాన్ని కూడా తీసుకుంటారని చెప్పారు. సలాడ్స్, నట్స్, స్ప్రౌట్స్, పండ్లు, ఆకుకూరలు, తాజా జ్యూస్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కొంత రక్షణ లభిస్తుందని వివరించారు.
అదేవిధంగా అధికంగా నూనెలో వేపిన వేపుళ్లు, ఉప్పు–కారం–మసాలాలు ఎక్కువగా వేసే వంటకాలు కూడా క్యాన్సర్కు దారితీస్తాయని ఆయన హెచ్చరించారు.
ఈ ఐదు కారణాల వల్లే చిన్న వయసులోనే క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, మంచి కణాలు కూడా క్యాన్సర్ కణాలుగా మారుతున్నాయని డాక్టర్ మంతెన తెలిపారు. రోజువారీ ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని, ఒకవేళ వచ్చినా తీవ్రతను తగ్గించవచ్చని ఆయన సూచించారు.
Disclaimer:
ఈ ఆర్టికల్లో ఇచ్చిన సమాచారం కేవలం సాధారణ అవగాహన మరియు విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్య సంబంధిత సమస్యలపై సందేహాలు ఉంటే తప్పనిసరిగా మీ వైద్యుడు లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



