హర్యానాలోని గురుగ్రామ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతి–యువకుడు కొంతకాలంగా లివింగ్ రిలేషన్షిప్లో జీవిస్తున్నారు. ఇటీవల యువతి పెళ్లి విషయమై ఒత్తిడి పెంచడంతో యువకుడు తీవ్ర కోపానికి లోనై ఆమెపై పాశవికంగా దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
డేటింగ్ యాప్ పరిచయం నుంచి లివింగ్ రిలేషన్షిప్ వరకు
పోలీసుల వివరాల ప్రకారం, త్రిపురకు చెందిన 19 ఏళ్ల యువతికి, ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల యువకుడు శివమ్తో గత ఏడాది సెప్టెంబర్లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ కలిసి గురుగ్రామ్ సెక్టార్–69లోని ఓ ఫ్లాట్లో సహజీవనం చేస్తున్నారు. అయితే కొంతకాలంగా యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెంచుతుండగా, యువకుడు తప్పించుకుంటూ వస్తున్నాడు.
పెళ్లి ఒత్తిడితో అమానుష దాడి
ఈ ఏడాది ఫిబ్రవరి 19న యువతి మరోసారి పెళ్లి విషయమై ప్రశ్నించడంతో యువకుడు ఆగ్రహంతో రెచ్చిపోయాడు. ఆమెను గదిలో బంధించి మెటల్ రాడ్తో తలపై దాడి చేశాడు. అనంతరం ఆమె ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దాడి తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
తల్లికి ఫోన్ కాల్.. ఆస్పత్రికి తరలింపు
బాధితురాలు తీవ్ర నొప్పిలో తల్లికి ఫోన్ చేసి జరిగిన ఘటనను వివరించింది. దీంతో తల్లి త్రిపుర నుంచి వెంటనే గురుగ్రామ్కు చేరుకుని కుమార్తెను ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం ఆమెకు అత్యవసర చికిత్స కొనసాగుతోంది.
నిందితుడు పోలీసుల అదుపులో
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో బాధితురాలి వాంగ్మూలం సేకరించిన పోలీసులు నిందితుడిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శివమ్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది.



