ఆధార్, యూపీఐల తరువాత ఇప్పుడు మరో డిజిటల్ విప్లవానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశంలోని ప్రతి ఇంటికీ — అక్షరాలా ప్రతి చిరునామాకు — ఓ ప్రత్యేకమైన డిజిటల్ ఐడీ ఇవ్వాలనే ప్రతిపాదనపై కేంద్రం యోచిస్తోంది. దీనివల్ల చిరునామా గుర్తింపులో ఒక స్పష్టత, సరళత ఏర్పడుతుంది. ఇకపై డోర్ డెలివరీల నుండి ప్రభుత్వ పథకాల వరకూ, ప్రతి వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారనుంది.
ఇది సాధారణ అడ్రస్ కాదు – డిజిటల్ అడ్రస్!
ప్రతి ఇంటికీ, స్థలానికి ఒక ప్రత్యేక డిజిటల్ చిరునామా ఇవ్వబోతున్నారు. దీన్ని డిజిపిన్ (DIGIPIN) అంటున్నారు — ఇది డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్. ప్రస్తుత పిన్కోడ్ల మాదిరిగా కాకుండా, ఇది ఒక్కో ఇంటికీ 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్గా ఉంటుంది. దీనివల్ల ప్రతి ఇల్లు, ఆఫీసు, షాపు వంటి ప్రదేశాలే కాకుండా, అడవులు, కొండలు, గ్రామాల లాంటి దూరప్రాంతాలను కూడా సులభంగా గుర్తించవచ్చు.
ఎందుకీ కొత్త వ్యవస్థ..?
ఇప్పటి వరకు మన దేశంలో చిరునామాల నిర్వహణకు స్పష్టమైన ప్రమాణాలు లేవు. దీంతో చాలాసార్లు చిరునామాలో ఉన్న అస్పష్టతల వలన డెలివరీలు తప్పిపోతున్నాయి. లాజిస్టిక్స్ రంగం, ఈ-కామర్స్, మరియు ఆన్లైన్ సేవలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. వాస్తవానికి, ఈ అస్పష్ట చిరునామాల వల్ల దేశానికి ప్రతి సంవత్సరం 10–14 బిలియన్ డాలర్ల వరకు నష్టం జరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఇది దేశ జీడీపీలో సుమారు అర శాతానికి సమానం!
ప్రైవసీకు పెద్దపీట
కొన్ని ప్రైవేట్ సంస్థలు ప్రజల అనుమతి లేకుండానే వారి చిరునామా సమాచారాన్ని సేకరిస్తూ దుర్వినియోగం చేస్తున్నాయి. దీనిని అరికట్టాలనే ఉద్దేశంతో, ఈ డిజిటల్ అడ్రస్ వ్యవస్థను డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (DPI)లో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. పౌరుల చిరునామా డేటాపై పూర్తి నియంత్రణ వారికే ఉండేలా, పటిష్టమైన ప్రైవసీ ప్రోటోకాల్స్ను రూపొందించనున్నారు. చిరునామా డేటాను ఎక్కడైనా వినియోగించాలంటే.. వ్యక్తిగత అనుమతి తప్పనిసరి.
పొలిసీ రూపకల్పన తుదిదశలో
ఈ ప్రతిపాదనపై ప్రధానమంత్రి కార్యాలయం (PMO) పర్యవేక్షణలో పోస్టల్ శాఖ పనిచేస్తోంది. ప్రస్తుతం ‘డిజిటల్ అడ్రస్ సిస్టమ్’కు సంబంధించిన ముసాయిదా సిద్ధంగా ఉంది. త్వరలోనే ప్రజల అభిప్రాయాల కోసం ఇది విడుదల కానుంది. ఈ ఏడాది చివరినాటికి కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చే అవకాశముంది. అంతేగాక, దీన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలన్న యోచనతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కొత్త బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశముంది.
ఇది డిజిటల్ ఇండియాలో మరో మైలురాయి!
ఆధార్ ద్వారా వ్యక్తిగత గుర్తింపు, యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులలో దూసుకెళ్లిన భారత్, ఇప్పుడు డిజిపిన్ ద్వారా చిరునామాల డిజిటలీకరణలోనూ నూతన అధ్యాయం మొదలుపెట్టబోతోంది. ఇది భవిష్యత్లో ప్రభుత్వ సేవల అందుబాటు, ఆన్లైన్ డెలివరీల గమనాన్ని పూర్తిగా మార్చివేసే సామర్థ్యం కలిగిన విప్లవాత్మక చర్యగా భావించవచ్చు.