అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ధికి కీలకంగా నిలిచే అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్కు జూన్ 26న శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్కు ప్రారంభకంకణం పూయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజ్యసభ సభ్యురాలు పురందేశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.
ఈ భారీ పర్యాటక ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.94.44 కోట్లను ఖర్చుచేయనుంది. గోదావరి పరివాహక ప్రాంతాలకు ఆకర్షణీయ రూపాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఇందులో భాగంగా హేవలాక్ వంతెన పునర్నిర్మాణం, పుష్కర్ ఘాట్ల అభివృద్ధి, గోదావరిలో నిత్యహారతి ఏర్పాట్లు, కడియం నర్సరీలో ఎక్స్పీరియన్స్ సెంటర్, బ్రిడ్జిలంకా–నిడదవోలు వంటి ప్రాంతాలను పర్యాటక హబ్లుగా తీర్చిదిద్దే పనులు జరుగనున్నాయి. కోట సత్తెమ్మ ఆలయానికి సరికొత్త మహత్యం తీసుకొచ్చేలా సౌందర్యీకరణ కార్యక్రమాలు చేపడతారు.
ఇప్పటికే పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. తొలుత ఘాట్ల సుందరీకరణ పనులు ప్రారంభం కానున్నాయి. 2027 గోదావరి పుష్కరాల నాటికి మొత్తం ప్రాజెక్టును పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది.
ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. దాదాపు 8 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ సహకారంతో మొత్తం రూ.375 కోట్ల నిధులతో టూరిజం అభివృద్ధి కార్యక్రమాలు అమలుకానున్నాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, పర్యాటక అభివృద్ధికి మద్దతు ఇస్తున్న కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు కృతజ్ఞతలు తెలిపారు.