విజయవాడ నగర ప్రజలకు శుభవార్త. కాలుష్యాన్ని తగ్గిస్తూ, పర్యావరణ హితంగా ప్రజా రవాణా సేవలను మెరుగుపరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఈ-బస్ సేవా పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 750 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించగా, విజయవాడకు 100 బస్సులు లభించనున్నాయి.
ఈ బస్సులు విద్యాధరపురం ఆర్టీసీ డిపో నుంచి నడపనుండగా, ఛార్జింగ్ అవసరాల కోసం అక్కడే 6000 కేవీ సామర్థ్యం కలిగిన ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటవుతోంది. ఒకసారి ఛార్జ్ చేస్తే ఈ బస్సులు 100 కి.మీ.ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలవు.
15 ప్రధాన రూట్లలో ఎలక్ట్రిక్ బస్సులు:
ఈ బస్సులు సిటీ ఆర్డినరీ మరియు మెట్రో ఎక్స్ప్రెస్ పేర్లతో క్రింది రూట్లలో సేవలు అందించనున్నాయి:
- కాళేశ్వరరావు మార్కెట్ – ఆటోనగర్
- రైల్వే స్టేషన్ – ఆటోనగర్
- హెచ్బీ కాలనీ – ఆటోనగర్
- హెచ్బీ కాలనీ – పెనమలూరు
- సిటీ బస్ పోర్టు – మైలవరం
- సిటీ బస్ పోర్టు – విస్సన్నపేట
- కాళేశ్వరరావు మార్కెట్ – పామర్రు
- ఎన్ఎస్బీ నగర్ – ఆటోనగర్
- పీఎన్బీఎస్ – విస్సన్నపేట
- జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ – ఆటోనగర్
- కబేళా – గవర్నమెంట్ ప్రెస్
- జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ – తాడిగడప
ఇంకా ఇతర మార్గాలపైనా బస్సులు నడిచే అవకాశముంది.
ఆర్థిక లాభం.. పర్యావరణ పరిరక్షణ
ప్రస్తుతం విజయవాడలో సుమారు 400 సిటీ బస్సులు నడుస్తున్నాయి. అయితే డీజిల్ ధరలతో ఆర్టీసీపై భారంగా మారిన నిర్వహణ ఖర్చులు, ఈ ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా గణనీయంగా తగ్గే అవకాశముంది. డీజిల్ వ్యయం తగ్గడంతో పాటు, నగరంలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని కంట్రోల్ చేయగలగడం ఈ కొత్త పథకంలో ప్రధాన ప్రయోజనంగా నిలవనుంది.
నిర్వహణ బాధ్యతలు
ఈ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ఆర్టీసీ మాత్రం సిబ్బంది నియామకం, నగదు లావాదేవీలను నిర్వహించనుంది.
పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు మెరుగైన సేవలందించడం లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. విజయవాడ నగర వాసులకు ఈ ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణంలో కొత్త అనుభూతినివ్వనున్నాయి.