తమిళనాడులోని కోయంబత్తూరు నగరం మరోసారి అమానుష ఘటనతో కుదిపిపోయింది. కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ కళాశాల విద్యార్థినిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తీవ్ర గాయాలతో, నగ్న స్థితిలో బాధితురాలిని ఎయిర్పోర్టు వెనుక భాగంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో పోలీసులు కనుగొన్నారు. ఈ దారుణం ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
స్నేహితుడిపై ఆయుధంతో దాడి
పోలీసుల ప్రకారం, బాధితురాలు నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఆమె తన స్నేహితుడితో కలిసి కారులో ఎయిర్పోర్టు వెనుక ఉన్న ప్రశాంత ప్రదేశానికి వెళ్లింది. ఈ సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి చేరుకొని కారుపై దాడి చేశారు. వారు ముందుగా ఆ విద్యార్థినితో ఉన్న స్నేహితుడిపై పదునైన ఆయుధంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం విద్యార్థినిని బలవంతంగా కారు నుండి లాగి తీసుకెళ్లి చీకట్లోకి తరలించారు. అక్కడ ఆమెపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడి గాయపరిచి పారిపోయారు.
ఖాళీ ప్రదేశంలో అపస్మారక స్థితిలో బాధితురాలు
తీవ్రంగా గాయపడిన స్నేహితుడు కొద్దిసేపటికి పీలామేడు పోలీస్ స్టేషన్కు చేరుకుని ఘటనను వివరించాడు. వెంటనే పోలీసులు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు ప్రారంభించారు. కొంతసేపటి తరువాత సమీపంలోని ఒక ఖాళీ ప్రదేశంలో అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని కనుగొన్నారు. ఆమె శరీరంపై గాయాలు ఉండడంతోపాటు వస్త్రాలు కూడా లేకుండా ఉన్నట్లు తెలిపారు. వెంటనే పోలీసులు ఆమెను రక్షించి అత్యవసరంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, తీవ్ర మానసిక షాక్లో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. గాయపడిన స్నేహితుడిని కోయంబత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.
ప్రత్యేక బృందాలతో విస్తృత గాలింపు
ఈ ఘటనపై పీలామేడు పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్లు 363 (అపహరణ), 376 (అత్యాచారం), 376D (సామూహిక అత్యాచారం) మరియు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు.
పోలీసు ఉన్నతాధికారులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. “నిందితులను త్వరగా పట్టుకుని కఠిన శిక్షలు విధించేలా చర్యలు తీసుకుంటాం” అని అధికారులు హామీ ఇచ్చారు.



