న్యూఢిల్లీ: చైనా తీసుకున్న తాజా ఆంక్షలు భారత్లోని ఆడియో ఎలక్ట్రానిక్స్ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అరుదైన భూ లోహాల ఎగుమతిపై చైనా విధించిన నియంత్రణల కారణంగా, దేశంలో 21,000కు పైగా ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల సమాఖ్య (ఎల్సినా) తాజా నివేదికలో తెలిపింది.
ఈ ఏడాది ఏప్రిల్లో చైనా టెర్బియం, డిస్ప్రోసియం వంటి అరుదైన లోహాలపై కఠినమైన ఎగుమతి లైసెన్సింగ్ను అమలు చేసింది. ఇవి అధిక పనితీరు కలిగిన NdFeB అయస్కాంతాల తయారీలో కీలకమైన ముడిసరుకులు. ముఖ్యంగా హియరబుల్స్, వేరబుల్స్ వంటి వినియోగదారు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఇవి విస్తృతంగా వినియోగిస్తారు.
ఈ పరిస్థితుల్లో, చైనాలో మాడ్యూళ్ళుగా తయారైన స్పీకర్లను దిగుమతి చేసుకోవడమే తయారీదారుల ఎంపికగా మారుతోందని ఎల్సినా తెలిపింది. దీని ప్రభావంగా భారత్లో స్పీకర్, ఆడియో విడిభాగాల తయారీలో నేరుగా 5,000-6,000 ఉద్యోగాలు, పరోక్షంగా 15,000 ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొంది. ముఖ్యంగా నోయిడా, దక్షిణ భారతదేశంలో ఈ సమస్య తీవ్రంగా ఉందని హెచ్చరించింది.
ఎల్సినా అంచనా ప్రకారం, అరుదైన భూ లోహాల ఆధారిత అయస్కాంతాలు సాధారణంగా బిల్లు ఆఫ్ మెటీరియల్స్లో 5-7 శాతం వరకు ఉంటాయి. భారత్ ప్రస్తుతం NdFeB అయస్కాంతాల అవసరాలకు 100 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. అందులో 90 శాతం చైనా నుంచే వస్తున్నాయి. కానీ, ధరల పెరుగుదల, పరిపాలన పరిమితుల వల్ల చైనా సరఫరాలు అంతరించిపోతున్నాయి. జపాన్, యూరోప్, అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంటే రెండు మూడు రెట్లు ఖర్చు అవుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో టీవీ తయారీ సంస్థ వీడియోటెక్స్ కూడా స్పందించింది. “అరుదైన భూ లోహాల ఆధారిత అయస్కాంతాలు టీవీ స్పీకర్లకు కీలకం. తాజా ఆంక్షలు దిగుమతులపై ఆధారపడుతున్న భారత పరిశ్రమకు సవాలు విసురుతున్నాయి. అయితే మా ఉత్పత్తిపై తక్షణ ప్రభావం పెద్దగా ఉండదని భావిస్తున్నాం. రాబోయే సీజన్ను దృష్టిలో పెట్టుకుని సరఫరాదారులతో కలిసి నిల్వలను పెంచుకుంటున్నాం,” అని సంస్థ డైరెక్టర్ అర్జున్ బజాజ్ తెలిపారు.