చైనాలో కొత్తగా 22 వైరస్‌లు గుర్తింపు – హెనిపా ముప్పుతో ప్రపంచం మరోసారి హెచ్చరికలో

china new upcomig virus

బీజింగ్: ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ విజృంభణ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే… చైనాలో మరోసారి వైరస్‌ల విషయంలో ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకున్నాయి. చైనా శాస్త్రవేత్తలు తాజాగా గబ్బిలాల్లో 22 కొత్త వైరస్‌లను గుర్తించారు. వీటిలో రెండు ప్రాణాంతక హెనిపావైరస్‌లకు జన్యుపరంగా దగ్గరగా ఉండటంతో ప్రపంచ ఆరోగ్య వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ వైరస్‌లు మనుషులకు లేదా పశువులకు వ్యాప్తి చెందే అవకాశాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు.

2017 నుండి 2021 మధ్యకాలంలో చైనా యునాన్ ప్రావిన్స్‌లోని 142 గబ్బిలాల కిడ్నీ కణజాలాల్లో ఈ కొత్త వైరస్‌లను శాస్త్రవేత్తలు గుర్తించారు. జన్యు విశ్లేషణ ఆధారంగా రెండు వైరస్‌లు – హెండ్రా, నిపా హెనిపావైరస్‌లకు అత్యంత సమీపంగా ఉన్నట్లు వెల్లడైంది. గతంలో ఈ హెనిపావైరస్‌లు మానవాళిపై తీవ్రమైన ప్రభావం చూపిన సందర్భాలున్నాయి.

పండ్ల తోటల వద్ద నివాసం.. వ్యాప్తికి అవకాశం

ఈ గబ్బిలాలు గ్రామీణ ప్రాంతాల్లోని పండ్ల తోటల సమీపంలో నివసిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. గబ్బిలాల మూత్రం ద్వారా ఈ వైరస్‌లు పండ్లపై పడే అవకాశముంది. అటువంటి పండ్లను మనుషులు లేదా పశువులు తినితే వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దీంతో గబ్బిలాల నివాస ప్రాంతాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఏర్పడింది.

యునాన్ బ్యాట్ హెనిపావైరస్ – కొత్తగా గుర్తించిన రెండు వైరస్‌లు

ఈ పరిశోధనలో ఇప్పటివరకు తెలియని రెండు హెనిపావైరస్‌లను శాస్త్రవేత్తలు గుర్తించి, వాటికి “యునాన్ బ్యాట్ హెనిపావైరస్ 1” మరియు “యునాన్ బ్యాట్ హెనిపావైరస్ 2” అని నామకరణం చేశారు. ఇవి హెనిపావైరస్ కుటుంబానికి చెందిన ప్రమాదకర వైరస్‌లతో 52% నుండి 57% జన్యు పదార్థాన్ని పంచుకుంటున్నట్లు తెలుస్తోంది.

శాస్త్రవేత్తల హెచ్చరిక

“ఈ వైరస్‌లు గబ్బిలాల మూత్ర వ్యవస్థలో ఉండటంతో, వాటి మూత్రంతో కలుషితమైన నీరు లేదా ఆహారం ద్వారా మానవులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇది అంతమందికి గమనించాల్సిన విషయమే,” అని మోనాష్ యూనివర్సిటీకి చెందిన మాలిక్యులర్ వైరాలజీ ప్రొఫెసర్ వినోద్ బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు. యునాన్ వాతావరణం, నిపా వైరస్ ప్రభావిత ప్రాంతమైన మలేసియాకు పోలికలు ఉండటంతో, ఈ ప్రాంతం zoonotic వ్యాధులకు అనువైన వాతావరణం అని ఆయన అన్నారు.

మరిన్ని మైక్రోబియల్ ముప్పులు బయటపడే అవకాశం

ఈ అధ్యయనంలో కేవలం వైరస్‌లే కాకుండా, “క్లోస్సియెల్లా యునానెన్సిస్” అనే కొత్త పరాన్నజీవిని, అలాగే “ఫ్లావోబాక్టీరియం యునానెన్సిస్” అనే బ్యాక్టీరియా జాతిని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. గత అధ్యయనాలు గబ్బిలాల మలం ఆధారంగా జరిగినప్పటికీ, తాజా పరిశోధనల్లో కిడ్నీ వంటి అంతర్గత అవయవాలను అధ్యయనం చేయడం వల్ల మైక్రోబియల్ ముప్పుల వివరాలు మరింత వెలుగులోకి వస్తున్నాయి.

గబ్బిలాలే ప్రధాన మూలాలు

గతంలో ఎబోలా, SARS, MERS, COVID-19 వంటి అనేక జూనోటిక్ వ్యాధులు గబ్బిలాల నుంచి వచ్చినవే. ఈ కొత్త వైరస్‌లు కూడా అలాంటి పరిణామాలకు దారి తీయవచ్చనే భయం వైద్య శాస్త్రవేత్తల్లో నెలకొంది. వ్యాధికారకాలు నేరుగా లేదా ఇతర జీవుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే అవకాశమున్న నేపథ్యంలో, ఈ కొత్త వైరస్‌లపై సమగ్ర పరిశోధనలు, ముందస్తు జాగ్రత్త చర్యలు అత్యవసరమయ్యాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి