యోగా వల్లే యాక్టివ్ చంద్రబాబు: 75ఏళ్ల వయస్సులోనూ నిత్యం యువకుడిగా ఎలా ఉంటున్నారో తెలుసా?

విజయవాడ, జూన్ 20:
ఇతరులు 60 దాటాక విశ్రాంతికి మొగ్గు చూపుతుంటే… ఆయన మాత్రం 75 సంవత్సరాల వయస్సులోనూ యుద్ధవీరుడిలా ముందుకెళ్తున్నారు. ప్రతి రోజు దాదాపు 18 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తున్నారు. రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల అనుభవంతోనూ, పరిపక్వతతోనూ ఆంధ్రప్రదేశ్‌ను మరోసారి అభివృద్ధి బాటలో నడిపిస్తున్న నేత నారా చంద్రబాబు నాయుడు.
అయితే, ఇంత ఎనర్జీ, చురుకుదనం వెనుక ఏదో పెద్ద రహస్యముందా? ఎక్కడి నుంచొచ్చిందీ శక్తి? దీనికి సమాధానం “యోగా” అనే ఒక చిన్న పదంలోనే దాగి ఉంది.

రోజూ వేకువజామున ప్రారంభమయ్యే కథ

చంద్రబాబు నాయుడి రోజు తెల్లవారకముందే మొదలవుతుంది. ఉదయం నాలుగు గంటలకే లేచి యోగా, ధ్యానం, హల్కా వ్యాయామం చేస్తారు. ఇది ఆయనకు కొత్త కాదు. 40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితం సాగిస్తున్న ఆయన… ఈ ప్రయాణాన్ని మానసికంగా, శారీరకంగా సమతుల్యంలో కొనసాగించడానికి ఎంచుకున్న మార్గం యోగానే.
ఆయన మాటల్లోనే చెప్పాలంటే, “నాయకుడి ఆరోగ్యం బాగుంటేనే, ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది.”

వరదలలోనూ, వేడిలోనూ, చలిలోనూ – ఎక్కడైనా యాక్టివ్

2024లో విజయవాడ వరదల సమయంలో చంద్రబాబు వీధుల్లో నడుస్తూ ప్రజలను కలిసి ధైర్యం చెప్పిన తీరు ఎవ్వరూ మర్చిపోలేరు. మోకాళ్ల లోతు నీటిలో నడుస్తూ ప్రజల దగ్గరికి వెళ్లిన ఆయన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఎన్నికల సమయంలో వ్యాన్ ఎక్కుతుంటే ఎలాంటి సహాయం లేకుండానే, తానే పైకి ఎక్కిన వీడియో నేటికీ ట్రెండింగ్‌లో ఉంటుంది.
ఇంత శక్తి, సహనం, చురుకుదనం కోసం ఆయన ఎలాంటి సాధన చేస్తున్నారో ఇప్పుడు చాలామందికి తెలుసు – అదే యోగా.

1994 నుంచే ప్రారంభమైన యోగా యాత్ర

నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1994లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు అప్పటినుంచే ప్రభుత్వ స్థాయిలో యోగా ప్రాధాన్యాన్ని అర్థం చేసుకున్నారు. తాను మాత్రమే కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులందరికి కూడా యోగా శిక్షణ ఇవ్వాలనే ఆలోచనతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శిక్షణా తరగతులు ప్రారంభించారు.

జైలులోనూ సాధన ఆపని నేత

2023లో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి జైలుకు తరలించబడిన సమయంలో కూడా ఆయన రోజువారీ యోగా, ధ్యానం మానలేదు. జైలు అధికారులు కూడా ఆయన నిబంధిత జీవనశైలిని ఆశ్చర్యంగా చూశారు. జైల్లోనూ ఆయన ఉదయం మూడున్నర గంటలకు లేచి ధ్యానం చేయడం, యోగా సాధన చేయడం అలవాటుగా కొనసాగింది.

విశాఖలో యోగాంధ్ర – ప్రపంచానికి సందేశం

ఈ సంవత్సరం జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించబోయే ‘యోగాంధ్ర – 2025’ అనే భారీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. లక్షలాది మందితో నిర్వహించే ఈ యోగా వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు పాల్గొంటున్నారు.
తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి మోదీ హాజరయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

యోగా విశ్వవిద్యాలయం – భవిష్యత్తుపై దృష్టి

మరింత ముందుకు సాగుతూ, చంద్రబాబు అమరావతిలో యోగా మరియు నేచురోపతి పరిశోధనా కేంద్రాన్ని స్థాపించాలన్న దిశగా ఆలోచిస్తున్నారు. మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమాన్ని దీని కోసం ఉపయోగించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అంతేకాకుండా, డీమ్డ్ యూనివర్సిటీ స్థాయిలో నాన్-ప్రాఫిట్ యోగా సంస్థను ఏర్పాటు చేసి విద్యార్థులకు, అధికారులకు, ప్రజలకు శిక్షణ ఇవ్వాలన్న ఆశయంతో ముందుకెళ్తున్నారు.

తన ఫిట్‌నెస్ వెనుక రహస్యాన్ని ఎన్నోసార్లు వెల్లడించిన నేత

చంద్రబాబు ఎన్నో సభల్లో, ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని చెప్పారు – “యోగా వల్లే నా శరీరం సహనంగా ఉంది. ఏ సమస్య వచ్చినా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడిని తట్టుకునే శక్తి యోగానే ఇచ్చింది.”
తన భార్య భువనేశ్వరి కూడా గతంలో మాట్లాడుతూ – “ప్రతి రోజు చంద్రబాబు యోగా, ధ్యానం చేస్తారు. ఇది ఆయన దైనందిన జీవితం” అని చెప్పారు.

యోగాను మతంతో కలపకండి – అది శాస్త్రీయ పద్ధతి

“యోగా ఒక మతానికి చెందినది కాదు. అది ఒక శాస్త్రీయ విధానం. ప్రివెంటివ్ హెల్త్‌కి యోగా మంచి ఔషధం. మనకు ఈ సంపదను ప్రపంచానికి ఇచ్చే బాధ్యత ఉంది” అని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు.
విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ యోగా చేయాలన్నది ఆయన లక్ష్యం.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి