ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో ఓ భారీ కార్గో నౌక మునిగిపోయింది. ఈ నౌక మెక్సికోకు వేలాది వాహనాలను రవాణా చేస్తూ ప్రయాణిస్తుండగా, కొన్ని వారాల క్రితం మంటలు చెలరేగిన నేపథ్యంలో చివరికి సముద్ర గర్భంలోకి వెళ్లిపోయింది.
3,000 వాహనాలు, 800 ఎలక్ట్రిక్ కార్లు మునిగిన నౌక
‘మార్నింగ్ మిడాస్’ పేరుతో రిజిస్టర్ అయిన ఈ కార్గో నౌకలో మొత్తం 3,000 కొత్త వాహనాలు ఉండగా, వీటిలో 800కి పైగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నట్లు సమాచారం. లండన్కు చెందిన జోడియాక్ మారిటైమ్ అనే సంస్థ ఈ నౌకను నిర్వహిస్తోంది. అలస్కా సమీపంలోని అలూషియన్ దీవుల వద్ద, అంతర్జాతీయ జలాల్లో నౌక మునిగిపోయిందని సంస్థ అధికారికంగా తెలిపింది.
తీరానికి 415 మైళ్ల దూరంలో, 16 వేల అడుగుల లోతులో మునిగిపోతోంది
అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) కథనం ప్రకారం, మంటలతో కలిగిన తీవ్ర నష్టం, వాతావరణ ప్రతికూలతలు, నౌకలోకి నీరు చేరడం వంటి సమస్యల కారణంగా నౌక తీరానికి 415 మైళ్ల దూరంలో, 16,404 అడుగుల లోతులో మునిగిపోయింది. అయితే, ఇప్పటివరకు మలినాల ప్రభావం కనిపించలేదని అమెరికా తీర రక్షణ దళం (యూఎస్ కోస్ట్ గార్డ్) ప్రతినిధి కామెరాన్ స్నెల్ స్పష్టం చేశారు.
సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు
ఈ నెల 3న, నౌక అలస్కా తీరానికి 300 మైళ్ల దూరంలో ఉండగా మంటలు చెలరేగాయి. వెంటనే అత్యవసర సంకేతాలు అందుకున్న యూఎస్ కోస్ట్ గార్డ్ స్పందించింది. నౌకలో ఉన్న 22 మంది సిబ్బంది లైఫ్ బోట్ల ద్వారా సురక్షితంగా బయటపడగా, వారిని సమీపంలోని వాణిజ్య నౌక సిబ్బంది రక్షించారు.
చైనాలో ప్రారంభం – మెక్సికోకు చివరి ప్రయాణం
ఈ నౌక చైనాలోని యెంటాయ్ నగర నుంచి మే 26న బయలుదేరింది. గమ్యం మెక్సికోలోని లాజారో కార్డెనాస్ పోర్ట్. మంటలు చల్లబెట్టేందుకు మొదటగా విమానాలు, కట్టర్ షిప్లను పంపినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో సహాయక బృందాన్ని రంగంలోకి దించారు. అయినా నౌకను గట్టెక్కించలేకపోయారు. 2006లో నిర్మితమైన ఈ నౌక లైబీరియా జెండాతో రిజిస్టర్ అయింది.