వేదమంత్రాలు, మేళతాళాలు, పెద్దల ఆశీస్సులతో జరిగే పెళ్లి మన సంప్రదాయాలలో ఎంతో పవిత్రమైనది. ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి ముందుకు అడుగేయాలని చేసే జీవన ఒప్పందం అదే వివాహం. కానీ ఇటీవలి కాలంలో పెళ్లిళ్ల పవిత్రతను దెబ్బతీసే సంఘటనలు వరుసగా బయటపడుతున్నాయి. అల్లుడితో పరారైన అత్త, మామతో పారిపోయిన కోడలు వంటి విచిత్ర ఘటనలు ప్రజలను షాక్కు గురిచేస్తున్నాయి.
గంటలో పెళ్లి… అదే సమయంలో వధువు హత్య
గుజరాత్లోని భావ్నగర్లో చోటుచేసుకున్న ఘటన ఈ విపరీత సంఘటనలన్నింటికంటే దారుణమైనది. తాళి కట్టడానికి మరో గంట మాత్రమే ఉండగా… వరుడే వధువును హత్య చేశాడు. పెళ్లి ఇంట్లో శుభసమయం రావాల్సిన తరుణంలో విషాద వాతావరణం నెలకొంది.
సహజీవనం… పెళ్లి నిర్ణయం… చివరికి ఘోరం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం — సాజన్ బరయ్య అనే వ్యక్తి, సోనీ రాథోడ్ అనే యువతి ఏడాదిన్నర కాలంగా కలిసి జీవిస్తున్నారు. ఇరువురి అనుమతితో పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. శనివారం రాత్రి వారి వివాహం జరగాల్సి ఉన్నది.
పెళ్లికి గంట ముందు చీర విషయంలో గొడవ… ఇనుపరాడ్తో దాడి
అయితే పెళ్లికి కేవలం ఒక గంట ముందు… పెళ్లి చీర, డబ్బుకు సంబంధించిన చిన్న విషయంపై వారిద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. ఆ కోపంలో సాజన్ ఇనుప రాడ్తో సోనీపై దాడి చేసి, ఆమె తలను గోడకు బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో సోనీ అక్కడికక్కడే మృతి చెందింది.
వధువును చంపి వరుడు పరారు… కేసు నమోదు
ఘటన తర్వాత భయబ్రాంతులకు గురైన సాజన్ అక్కడి నుంచి పరారయ్యాడు. పెళ్లికి వచ్చిన వారు ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో, పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాజన్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.



