అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆశ్రమ పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు నాలుగు రోజులపాటు అడవిలో తలదాచుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చదువులో వెనకబడ్డామనే ఆవేదనతో పాఠశాల నుంచి బయటకు వెళ్లిన ఈ బాలికలు, అడవిలో దుంపలు తింటూ, వాగు నీరు తాగుతూ జీవనం కొనసాగించారు.
వివరాల్లోకి వెళితే — జిల్లాలోని పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ కించూరు గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు పెదబయలు ఆశ్రమ బాలికల పాఠశాలలో 5వ మరియు 6వ తరగతుల్లో చదువుతున్నారు. ఇటీవల చదువులో వెనకబడిన కారణంగా నిరాశకు గురైన వీరు, ఈ నెల 6న పాఠశాల నుంచి నిశ్శబ్దంగా బయటకు వెళ్లి సమీపంలోని కారడవిలోకి అడుగుపెట్టారు.
అడవిలో దుంపలు తింటూ, వాగులో నీరు తాగుతూ, కొండ ప్రాంతంలోని ఒక గుహలో నాలుగు రోజులపాటు తలదాచుకున్నారు. బాలికలు కనిపించకపోవడంతో పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, చుట్టుపక్కల శోధించారు. అయినప్పటికీ వారి ఆచూకీ లభించకపోవడంతో ఈ నెల 8న పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు.
పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి అడవిలో గాలింపు ప్రారంభించారు. సోమవారం డ్రోన్ కెమెరాల సహాయంతో గాలింపు చేపట్టగా, కొంచూరు కొండల్లోని గుహలో ఆ ఇద్దరు బాలికలు దాక్కున్నట్లు గుర్తించారు. గ్రామస్థుల సహకారంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
చదువులో వెనకబడ్డామనే బెంగతోనే అడవిలోకి వెళ్లిపోయామని ఆ బాలికలు పోలీసులకు తెలిపారు. ఈ సంఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.



