ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ హెచ్చరిక. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండగా, సోమవారం మరో కొత్త అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో ఆగస్ట్ 18 వరకు రాష్ట్రంలో విస్తృత వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఎక్కడ ఎక్కువ వర్షాలు?
- కోస్తా జిల్లాలు – అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో ఎక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
- ఉత్తర కోస్తా జిల్లాలు – శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు.
- రాయలసీమ – తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
మత్స్యకారులకు హెచ్చరిక
అల్పపీడన ప్రభావంతో సముద్రం ఆగ్రహిస్తుందని, మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
వర్షాల ప్రభావం
ఇప్పటికే గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల కొన్ని జిల్లాలు లోటు వర్షపాతం నుంచి అధిక వర్షపాతం జాబితాలోకి చేరాయి.
- అధిక వర్షపాతం నమోదైన జిల్లాలు: పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం.
రుతుపవనాల పరిస్థితి
జూన్, జూలై నెలల్లో వర్షాలు తక్కువగా నమోదై లోటు వర్షపాతం ఏర్పడింది. అయితే, ఇటీవల అల్పపీడనాలు వరుసగా ఏర్పడటంతో రాష్ట్రంలో వానలు పెరిగాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఆగస్ట్ చివరి వరకు నైరుతి రుతుపవనాలు చురుకుగా కొనసాగుతాయి.



