న్యూయర్, సంక్రాంతి పండుగల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలకు శుభవార్త చెప్పింది. రేషన్ దుకాణాల ద్వారా అందించే నిత్యావసర సరుకుల్లోకి గోధుమ పిండిని కూడా చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేజీ గోధుమ పిండి కేవలం రూ.20కే రేషన్ షాపుల్లో అందించనుంది.
ఈ నిర్ణయం వల్ల పండుగల సమయంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చుతో పిండి వంటలు చేసుకునే అవకాశం లభించనుంది.
జనవరి 1 నుంచి అమల్లోకి
ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం
- జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో గోధుమ పిండి విక్రయం ప్రారంభం కానుంది
- కేజీ గోధుమ పిండి ధరను రూ.20గా నిర్ణయించారు
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో గోధుమ పిండి ధరలు కేజీకి రూ.40 నుంచి రూ.80 వరకు ఉండటంతో.. ప్రభుత్వ నిర్ణయం లబ్ధిదారులకు పెద్ద ఊరటగా మారనుంది.
ముందుగా పట్టణాల్లో అమలు
మొదటి దశలో
- జిల్లా కేంద్రాలు
- పట్టణాలు
- నగరాల్లో
ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అనంతరం గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించనుంది.
జనవరిలో ఇవ్వాల్సిన సరుకులను ముందుగానే సిద్ధం చేస్తూ.. డిసెంబర్ 26 నుంచే పంపిణీ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు
గోధుమ పిండి పంపిణీ కోసం పౌరసరఫరాల శాఖ ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఇప్పటికే పలు జిల్లాల్లోని రేషన్ షాపులకు సరుకులు చేరినట్లు సమాచారం.
డిమాండ్ను బట్టి మరిన్ని సరుకులను సరఫరా చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిర్ణయానికి కారణం ఇదే
దేశవ్యాప్తంగా గోధుమల వినియోగాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో వరి ఉత్పత్తి అధికంగా ఉండగా.. ఉత్తరాదిలో గోధుమల సాగు ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు తక్కువ ధరలో గోధుమ పిండి అందించాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.



