ఆటో డ్రైవర్లకు చంద్రబాబు శుభవార్త – మళ్లీ సాయం ప్రారంభమవుతుందా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సాగిన ‘వాహన మిత్ర’ పథకం మళ్లీ ప్రారంభం కానుందనే సంకేతాలు ఇచ్చారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత వైసీపీ ప్రభుత్వం సమయంలో ఆటో డ్రైవర్లకు ప్రతి ఏడాది ₹10,000 చొప్పున ఆర్థిక సాయం అందజేసింది. చిన్న చిన్న రిపేర్లు, ఇన్సూరెన్స్ వంటి అవసరాలకు ఇది ఉపయోగపడింది.

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకం నిలిచిపోయింది. దీంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.

తాజాగా అమరావతిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించిన ఆయన, అదే రోజు ఆటో డ్రైవర్లకు కూడా ప్రత్యేక సాయం అందించనున్నట్లు చెప్పారు. ఇది ఆ వర్గానికి మళ్లీ ఊరట కలిగించే అవకాశం ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.

వైసీపీ హయాంలో ఇచ్చిన ‘వాహన మిత్ర’ పునరావృతమేనా?

ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు ఇంతకు ముందు అందిన ₹10,000 సాయాన్ని అదే రూపంలోనే తిరిగి ఇవ్వనున్నారు లేదా కొత్త పేరుతో మరింత బడ్జెట్‌ కేటాయించనున్నారా? అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆటో డ్రైవర్లు, “అప్పటిలాగే తిరిగి ₹10 వేలు అందితే సరిపోతుంది” అని భావిస్తున్నారు.

మహిళల ఉచిత బస్సు పథకంతో తమ ఆదాయం తగ్గిపోతుందనే ఆందోళనలో ఉన్న ఆటో డ్రైవర్లకు ఇప్పుడు ఈ ప్రకటన తాత్కాలిక ఊరటగా మారిందని చెప్పాలి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి