ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, వాటివల్ల జరిగే ప్రాణనష్టం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు కఠిన మరియు శాస్త్రీయ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదాల నిజమైన కారణాలను గుర్తించాలంటే ప్రతి సంఘటనపైన థర్డ్పార్టీ ఆడిట్ తప్పనిసరి చేయాలని ఆయన ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన రోడ్ సేఫ్టీ కౌన్సిల్ ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ఆందోళనకర గణాంకాలు
సమీక్షా సమావేశంలో డీజీపీ హరీశ్కుమార్ గుప్తా, రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ముఖ్యమంత్రికి వివరించిన గణాంకాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి.
ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటివరకు 15,462 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా, వీటిలో 6,433 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, పల్నాడు, అన్నమయ్య, కాకినాడ జిల్లాల్లో ప్రమాదాలు అత్యధికంగా నమోదవుతున్నాయని అధికారులు నివేదించారు.
అధికారుల ప్రకారం, మొత్తం ప్రమాదాల్లో 79 శాతం అతివేగమే ప్రధాన కారణం గా గుర్తించారు.
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు, రోడ్డు సురక్షితంపై కొత్త దృక్పథంతో, అమలు చేయదగ్గ పటిష్ఠ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు.
సందర్భంగా ఆయన ఇచ్చిన ప్రధాన ఆదేశాలు:
- రాష్ట్రవ్యాప్తంగా అతివేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ గవర్నర్లు తప్పనిసరి చేయాలి.
- ప్రతి జాతీయ మరియు రాష్ట్ర రహదారిపై ప్రతి అర కిలోమీటరుకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసి, వాటిని నేరుగా RTGSతో అనుసంధానం చేయాలి.
- రాష్ట్రం మొత్తంలో గుర్తించిన 680 బ్లాక్ స్పాట్స్లో రోడ్ ఇంజనీరింగ్ లోపాలను యుద్ధప్రాతిపదికన సరిదిద్దాలి.
- ముఖ్యంగా ప్రైవేట్ బస్సుల్లో, స్లీపర్ బస్సుల్లో భద్రతా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మార్పులను అనుమతించరాదని, వాటిపై ఉక్కు పాదం మోపాలని స్పష్టం చేశారు.
గుంతలేని రహదారులే ప్రభుత్వ లక్ష్యం
రోడ్డు భద్రత మాత్రమే కాదు, రహదారుల నాణ్యతపై కూడా సీఎం దృష్టి సారించారు. ఆర్&బీ శాఖతో నిర్వహించిన మరో సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ:
- రాష్ట్రంలో గుంతలేని రహదారులే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
- రహదారి పనుల్లో నాణ్యతను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
- పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే కాంట్రాక్టర్లు, ఇంజనీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ రెండు కీలక సమీక్షల్లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



