టాలీవుడ్లో ఇటీవల హాట్ టాపిక్గా మారిన ‘దండోరా’ సినిమా ఈవెంట్ వివాదం రోజు రోజుకీ మరింత ముదురుతోంది. హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తనను ఉద్దేశిస్తూ శివాజీ చేసిన వ్యాఖ్యలకు నటి అనసూయ భరద్వాజ్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఇటీవల శివాజీ “త్వరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు కూడా రావాలని కోరుకుంటున్నా” అంటూ చేసిన వ్యాఖ్యలపై అనసూయ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేసిన ఆమె, తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు.
“నేను చాలా దూరం ప్రయాణించి ఇక్కడికి వచ్చాను. మీ సానుభూతి నాకు అవసరం లేదు. నా హద్దులు నాకు తెలుసు. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో కూడా నాకు తెలుసు” అంటూ అనసూయ వ్యాఖ్యానించారు. తన జీవితంలో ఎవరి సహాయం లేకుండా నిలబడ్డానని, అనవసరమైన సలహాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రెస్ మీట్లో తనను బాధితుడిగా చూపించుకునే ప్రయత్నం శివాజీ చేస్తున్నారని అనసూయ ఆరోపించారు. ఇది పూర్తిగా నార్సిస్టిక్ ప్రవర్తనకు నిదర్శనమని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదాన్ని వ్యక్తిగతంగా కాకుండా, మహిళలందరిపై చేసిన వ్యాఖ్యలుగా చూడాల్సిన అవసరం ఉందని అనసూయ అన్నారు.
హీరోయిన్ల దుస్తులు, వారి వ్యక్తిగత ఎంపికలపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసిన అనసూయ, ఇది కేవలం తన సమస్య కాదని, మహిళల గౌరవానికి సంబంధించిన అంశమని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో తప్పు సందేశం ఇస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాఖ్యలతో అనసూయ మరోసారి తన స్టాండ్ను బలంగా చాటగా, టాలీవుడ్లో ఈ వివాదం ఇంకా ఎంతవరకు వెళ్తుందో చూడాలి. సోషల్ మీడియాలోనూ అనసూయకు మద్దతుగా పెద్ద ఎత్తున స్పందనలు వస్తున్నాయి.



