అహ్మదాబాద్: జూన్ 12న అహ్మదాబాద్ నగరంలో చోటు చేసుకున్న విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికుల తో పాటు, 34 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ విషాద ఘటనలో ఓ కుటుంబం కనీసం 80 మంది డాక్టర్లను బతికించిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే… మెఘాణీ నగర్లో నివసించే రవి ఠాకూర్ కుటుంబం గత 15 ఏళ్లుగా బీజే మెడికల్ కాలేజీకి భోజనం సరఫరా చేస్తూ జీవనం సాగిస్తోంది. ప్రమాదం జరిగిన రోజున కూడా రవి ఠాకూర్, ఆయన భార్య లలిత, తండ్రి ప్రహ్లాద్ ఠాకూర్లు మధ్యాహ్నం 1 గంట సమయంలో వార్డుల్లోని డాక్టర్లకు టిఫిన్ క్యారియర్లతో భోజనం తీసుకెళ్లారు.
ఆ సమయంలో సుమారు 80 మంది డాక్టర్లు మెస్కు వెళ్లే సమయంలో ఉండగా, వారంతా రవి కుటుంబం వార్డుల్లోకి భోజనం తీసుకురావడంతో అక్కడే ఉండిపోయారు. దీంతో వారు ప్రమాదానికి గురికాకుండా ప్రాణాలతో బయటపడ్డారు. కానీ దీనికి ప్రతిఫలంగా రవి ఠాకూర్ తన రెండేళ్ల కూతురు ఆధ్య, తల్లి సర్లా ఠాకూర్ను కోల్పోయారు.
అదే రోజున, ఆధ్య తన నాన్నతో వెళ్లాలని అడిగినా, రవి ఎండ ఎక్కువగా ఉందని తల్లితో ఉండమని చెప్పాడు. పాపను తన తల్లి దగ్గర వదిలి వెళ్లాడు. మెస్లో వంట చేస్తూ ఉండగా విమానం భవనంపై కూలింది. కొద్దిసేపటిలోనే శబ్దం, మంటలు, పొగతో ఆ ప్రాంతం అతలాకుతలమైంది. వెంటనే పరుగెత్తి వచ్చేందుకు యత్నించినా, పోలీసులు ఆపడంతో లోపలికి వెళ్లలేకపోయారు.
DNA పరీక్షల ద్వారా మృతదేహాలు సరికొలిపి, గురువారం ఉదయం కుటుంబానికి సమాచారం ఇచ్చారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. రవి ఏడుస్తూ, “ఆ రోజు పాపను నాతో తీసుకెళ్లి ఉంటే బతికేది…” అంటూ తన బాధను వ్యక్తం చేశాడు.
ఈ ఘటన ఒకవైపు 80 మంది డాక్టర్లకు ప్రాణదాతగా నిలుస్తే… మరోవైపు రవి కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో ఇలాగే శోకం నింపింది. బయటపడిన సంఘటనలలో ఇది కూడా ఒకటి మాత్రమే.