ఎన్టీఆర్ జిల్లా: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం (ఆగస్టు 19)సందర్భంగా విశేష ప్రతిభకనబరిచిన ఫొటోగ్రాఫర్లకు జిల్లాస్థాయిలో పురస్కారాలు ప్రదానం చేయడం జరుగుతుందని.. జిల్లా పరిధిలోని ఫొటోగ్రాఫర్లు జులై 31వ తేదీలోగా తమ ఎంట్రీలు పంపాల్సి ఉంటుందని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నామని.. మొదటి విభాగంలో జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, స్వచ్ఛాంధ్ర/స్వచ్ఛ ఎన్టీఆర్, యోగాంధ్ర అంశాలకు సంబంధించి ఫొటో ఎంట్రీలు పంపొచ్చన్నారు. రెండో విభాగంలో తల్లికి వందనం/విద్య, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, దీపం – 2 ఉన్నాయని, మూడో విభాగంలో అత్యుత్తమ న్యూస్ ఫొటో పోటీ ఉంటుందన్నారు. ప్రతి విభాగంలో ప్రథమ (రూ. 10 వేలు), ద్వితీయ (రూ. 7,000), తృతీయ (రూ. 4 వేలు) బహుమతులతో పాటు రూ. 2 వేలు చొప్పున ఆరుగురికి ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్లు వివరించారు. ఒక ఫొటోగ్రాఫర్ ఒక సెక్షన్ నుంచి మూడు ఫొటోలు, అదేవిధంగా మొత్తం మూడు సెక్షన్ల నుంచి తొమ్మిది ఫొటోలు పంపవచ్చు. 2024, జూన్ 12 నుంచి 2025, జులై 31 మధ్య తీసిన ఫొటోలై ఉండాలి. ఫొటో సైజు 12X10 ఉండాలని, ఫొటోలు ఎన్టీఆర్ జిల్లాలో మాత్రమే తీసి, పబ్లిసిటీకి మాత్రమే ఉపయోగించేవిగా ఉండాలి. వాటర్ మార్క్, మార్ఫింగ్ వంటి వాటిని అనుమతించడం జరగదు. ఉత్తమ ఫొటోల ఎంపిక విషయంలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయమని, ఒరిజినల్ ఫొటో ఎంట్రీలను డీపీఆర్వో కార్యాలయం, స్టేట్ గెస్ట్ హౌస్, విజయవాడ-520002 చిరునామాకు నేరుగా లేదా పోస్టల్ ద్వారా సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు.
ఉత్తమ ఫొటోగ్రాఫర్లకు జిల్లాస్థాయి పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం.
