భక్తి ఉంటే ప్రతిభ కూడా అద్భుతంగా బయటపడుతుంది అనడానికి ఇదే నిదర్శనం. మధ్యప్రదేశ్కు చెందిన త్రిలోక్ సిందియా అనే భక్తుడు గాజు బాటిల్ లోపల తిరుమల శ్రీవారి ఆలయ గోపురాన్ని రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వీడియోలోనే అద్భుతంగా కనిపిస్తున్న ఈ కళాఖండం, దగ్గరగా చూస్తే మరింత వావ్ అనిపిస్తోంది.
చేతివేలు కూడా పట్టని చిన్న గాజు బాటిల్ లోపల చెక్క ముక్కలతో తిరుమల ఆలయ గోపుర నమూనాను రూపొందించాడు త్రిలోక్ సిందియా. దాదాపు 30 రోజుల పాటు శ్రమించి, ప్రత్యేక స్టిక్ సహాయంతో ఫెవికాల్ ఉపయోగించి ఈ కళాఖండాన్ని సిద్ధం చేశాడు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయన, ఆలయం ముందు ఈ గోపురాన్ని మీడియాకు చూపించారు.
తిరుమల వెంకన్నపై తనకున్న భక్తిని ఇలా వినూత్నంగా చాటుకున్నానని తెలిపిన త్రిలోక్, ఇంతకుముందు అయోధ్య రామమందిరం, ఇండియా గేట్, ఎర్రకోట వంటి ప్రముఖ కట్టడాల మినీచర్ మోడల్స్ను కూడా గాజు బాటిళ్లలో తయారు చేసినట్లు చెప్పారు. ఆయన ప్రతిభను చూసిన భక్తులు, పర్యాటకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



