సంక్రాంతి పండుగ వేళ సొంతూరికి వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. పండుగ సీజన్లో హైవేలపై ఏర్పడే తీవ్ర ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టే దిశగా కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద ఏర్పడే జామ్ల వల్ల ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
టోల్ చార్జీలు ప్రభుత్వమే భరించే అవకాశం
సంక్రాంతి సమయంలో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా టోల్ చార్జీలను తాత్కాలికంగా ప్రభుత్వం భరించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ అంశంపై ఇవాళ తెలంగాణ సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. సమావేశం అనంతరం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
ఎక్కడ ఎక్కువ ట్రాఫిక్ సమస్య?
ప్రతి ఏడాది సంక్రాంతి సమయంలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పంతంగి, కొర్లపాడు టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాల రద్దీ ఏర్పడుతోంది. ఈ కారణంగా ప్రయాణికులు గంటల తరబడి టోల్ ప్లాజాల వద్దనే ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ సమస్యను శాశ్వతంగా కాకపోయినా, పండుగ రోజుల్లో అయినా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
కేంద్ర అనుమతి అవసరం
టోల్ చార్జీలను ప్రభుత్వం భరించాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల టోల్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయనుంది.
ఏ ప్రాంతాలకు లాభం?
కేంద్రం నుంచి అనుమతి లభిస్తే విజయవాడ, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ తదితర మార్గాల్లో ప్రయాణించే వారికి భారీ ఊరట లభించనుంది. ట్రాఫిక్ జామ్లు తగ్గి, ప్రయాణికులు వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది.



