నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే నియామక బోర్డు శుభవార్త అందించింది. భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 వేలకుపైగా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. కేవలం పదో తరగతి అర్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే అవకాశం ఉండటం విశేషం.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుదారుల వయసు కనీసం 18 సంవత్సరాలు పూర్తై, గరిష్ఠంగా 36 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇతర రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈబీసీ, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.250గా నిర్ణయించారు. దరఖాస్తు ప్రక్రియ 2026 జనవరి 21 నుంచి ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలు, అర్హతలు, పోస్టుల విభజన తదితర సమాచారం కోసం అధికారిక రైల్వే రిక్రూట్మెంట్ పోర్టల్ను సందర్శించాలని రైల్వే బోర్డు సూచించింది.
ఎంపిక విధానం ఇలా ఉంటుంది..
ఈ నియామక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)లో ఉత్తీర్ణత సాధించాలి. సీబీటీలో అర్హత పొందిన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) నిర్వహిస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ పూర్తిచేస్తారు. ఈ అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను రైల్వే బోర్డు విడుదల చేయనుంది.



