ఆస్ట్రియాలోని అత్యంత ఎత్తైన గ్రాస్గ్లాక్నర్ పర్వతంపై జరిగిన విషాద ఘటన అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. 33 ఏళ్ల కెర్స్టిన్ గర్ట్నర్ అనే మహిళ ఘాఢమైన చలికి గురై గడ్డకట్టిపోయి మరణించింది. ఈ ప్రమాదానికి కారణం ఆమె ప్రియుడి నిర్లక్ష్యమేనన్న అభియోగాలపై, అనుభవజ్ఞుడైన పర్వతారోహకుడు థామస్ ప్లాంబర్గర్ (39)పై అధికారులు హత్య కేసు నమోదు చేశారు.
ఈ ఏడాది జనవరిలో కెర్స్టిన్, థామస్ కలిసి గ్రాస్గ్లాక్నర్ను అధిరోహించేందుకు బయలుదేరారు. అయితే అనుకున్న సమయం కంటే రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమవడంతో వారు తీవ్ర ప్రతికూల వాతావరణంలో చిక్కుకు పోయారు. మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ చలి, గాలివానల దాడి కారణంగా కెర్స్టిన్ అలసటకు లోనయ్యి ముందుకు సాగలేని పరిస్థితి ఏర్పడింది. శిఖరానికి కేవలం 150 అడుగుల దూరంలో ఉండగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రాసిక్యూషన్ ఆరోపణలు:
తెల్లవారుజామున 2 గంటల సమయంలో థామస్ “సహాయం తీసుకురావాలి” అని చెబుతూ కెర్స్టిన్ను అతి దారుణమైన వాతావరణంలో ఒంటరిగా వదిలేసి వెళ్లాడని అధికారులు పేర్కొన్నారు. తన వద్ద ఉన్న ఎమర్జెన్సీ దుప్పట్లు, రక్షణ పరికరాలు ఏవీ ఆమెకు ఇవ్వలేదన్న తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంతేకాకుండా, సహాయక బృందాలకు సమాచారమివ్వడంలో గంటల తరబడి ఆలస్యం చేయడంతో పాటు తొలి కాల్ తర్వాత ఫోన్ను సైలెంట్లో పెట్టాడని విచారణలో వెల్లడైంది.
తీవ్ర గాలులు, మంచు తుఫాన్ల కారణంగా రక్షణ బృందాలు మరుసటి రోజు ఉదయం వరకు అక్కడికి చేరుకోలేకపోయాయి. వారు చేరేలోపే కెర్స్టిన్ ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో థామస్పై తీవ్రమైన నిర్లక్ష్యంతో హత్య చేసినట్లు కేసు నమోదు చేశారు. ఆరోపణలు రుజువైతే అతనికి గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
అయితే ఇది “దురదృష్టకర ప్రమాదం మాత్రమే” అని థామస్ తరఫు న్యాయవాది వాదిస్తున్నారు. ఈ కేసు విచారణ 2026 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది.



